నెలలో 21 రోజుల పాటు ఎమ్మెల్యేలు ప్రజల్లోనే వుండాలని నేతలకు క్లాస్ పీకారు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్. సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తానని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.

తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులకు, నేతలకు క్లాస్ పీకారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మంత్రులు కలుపుకుని వెళ్లాలని ఆయన ఆదేశించారు. జూన్ 2 నుంచి జరిగే సమావేశాలకు ఎమ్మెల్సీలు, ఎంపీలను పిలవాలని కేసీఆర్ సూచించారు. నెలలో 21 రోజుల పాటు ఎమ్మెల్యేలు ప్రజల్లోనే వుండాలని.. పార్టీ ఎప్పటికప్పుడు గమనిస్తూనే వుంటుందని సీఎం హెచ్చరించారు. సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తానని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. కర్ణాటకలో ఎవరు గెలిచినా పెద్ద విషయం కాదన్న ఆయన.. దేశానికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని దుయ్యబట్టారు. 

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో బీఆర్ఎస్ కు 104 సీట్లు వస్తాయని కేసీఆర్ చెప్పారు. గత పదేళ్లలో ప్రజలకు ఏం చేశామో ప్రజలకు వివరించాలని కేసీఆర్ చెప్పారు. ప్రజలకు చేసిన సేవ గురించి వివరిస్తే చాలన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఆయా జిల్లాల్లో మంత్రులు పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ సూచించారు.

ALso Read: ఇప్పుడు ఎన్నికలొచ్చినా 105 సీట్లు: బీఆర్ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్

తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులను తెలంగాణ వచ్చిన తర్వాత మారిన పరిస్థితులను ప్రజలకు వివరించాలని కేసీఆర్ కోరారు. మరో ఆరు మాసాల్లో ఎన్నికలు వస్తాయని కేసీఆర్ చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజల మధ్యే ఉండాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ఎన్నికల షెడ్యూల్ తీసేస్తే ఐదు నెలలే ఉంటుందని కేసీఆర్ చెప్పారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పూర్తిగా నియోజకవర్గాలకే పరిమితం కావాలని ఆయన సూచించారు.