కేసీఆర్ ప్రసంగం లైవ్ మధ్యలోనే కట్.. ఆయన ఆదేశంతోనే నిలిపివేత.. కారణమేంటి..?
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రసంగానికి సంబంధించిన లైవ్ ప్రసారాలను మధ్యలోనే నిలిపివేయమని చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు ఆ పార్టీలో చేరారు. వారికి కేసీఆర్ గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అయితే అనంతరం కేసీఆర్ ప్రసంగిస్తూ.. పలు అంశాలను ప్రస్తావించారు. అయితే కేసీఆర్ ప్రసంగం లైవ్ ప్రసారాలను మధ్యలోనే నిలిపివేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు. ఏస్ మీడియా ద్వారా లైవ్ ప్రసారాలను.. మీడియాకు ఇస్తున్నారు.
అయితే ఈ రోజు కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో రైతు సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడారు. అయితే ఓ సందర్భంలో కేసీఆర్.. ‘‘వద్దయ్యా బాబు.. పోమ్మని చెప్పిన కదా’’ అని అన్నారు. ఆ తర్వాత వెంటనే లైవ్ ప్రసారాలు నిలిచిపోయాయి. అయితే సీఎం కేసీఆర్ లైవ్ ఎందుకు నిలిపివేయించారనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే మీడియాకు లోనికి అనుమతి లేకపోవడంతో అక్కడ.. కేసీఆర్ ఏం మాట్లాడి ఉంటారనేది తెలియకుండా పోయింది. అయితే లైవ్ ఆపేసి మరి మహారాష్ట్ర నేతలతో కేసీఆర్ అంతగా ఏం మాట్లాడి ఉంటారనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాఫిక్గా మారింది.
అంతకుముందు కేసీఆర్ మాట్లాడుతూ.. దేశమంతా కూడా తెలంగాణ తరహా పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. దేశంలో రైతు సంఘటిత శక్తిని ఏకం చేద్దామని పిలుపునిచ్చారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో అటు పోట్లు చూశానని చెప్పారు. తన రాజకీయ జీవితమమంతా పోరాటలేనని అన్నారు. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లేకుండా ఉండదని అన్నారు. పరిష్కారం లేని సమస్యలు ఉండవని.. గెలుపుకోసం కృషి చేయాల్సి ఉంటుందని కేసీఆర్ అన్నారు. రైతుల పోరాటం న్యాయమైనదని అన్నారు. గెలవాలంటే చిత్తశుద్దితో ఉండాలి.. తలచుకుంటే ఏదైనా సాధ్యమేనని చెప్పారు. రైతుల పోరాటంపై ప్రధాని మోదీ కనీసం సానుభూతి చూపలేదని విమర్శించారు. రైతులను ఖలీస్తానీలు, ఉగ్రవాదులు, వేర్పాటువాదులు అంటూ నిందలు వేశారని మండిపడ్డారు. 750 మంది రైతులు చనిపోతే మోదీ స్పందించలేదని అన్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలు లేకుంటే 3 నల్లా చట్టాలను రద్దు చేసేవారు కాదని విమర్శించారు. ఆ ఎన్నికల కోసమే ప్రధాని మోదీ తియ్యటి మాటలు చెప్పారని అన్నారు. రైతుల పోరాటం వల్లే కేంద్రం 3 నల్లా చట్టాలను రద్దు చేసిందని అన్నారు.
తెలంగాణ వచ్చాక ఇక్కడ రైతుల సమస్యలను పరిష్కరించుకున్నామని చెప్పారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిపోయాయని చెప్పారు. తెలంగాణలో ఏం చేశామో మీరంతా ఒకసారి చూడాలని మహారాష్ట్ర నేతలతో అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని సూచించారు. దేశం అంతా తెలంగాణ తరహా పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. రైతులు ఇంకా ఎంతకాలం గిట్టుబాటు ధర కోసం పోరాడాలని ప్రశ్నించారు. ఒకప్పుడు సింగపూర్ ఎలా ఉండేది..? ఇప్పుడు ఎలా ఉంది? అని అన్నారు. ఏ వనరులు లేని సింగపూర్ అంత అభివృద్ది చెందినప్పుడు.. అన్ని వనరులు ఉన్నా భారతదేశం ఎందుకు అభివృద్ది చెందదని ప్రశ్నించారు. 14 మంది ప్రధానమంత్రులు మారినా మనదేశ తలరాత మారలేదని అన్నారు. ఇప్పుడున్న ఆయన 14వ ప్రధానమంత్రి అని.. ఆయనకు కూడా జ్ఞానం లేదని విమర్శించారు.