గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రత్యేకంగా 20 నిమిషాలపాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పట్నం మహేందర్ను క్యాబినెట్ మంత్రిగా తీసుకుంటున్న సందర్భంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు, ఇతర పెండింగ్ బిల్లులపై చర్చ జరిగినట్టు సమాచారం.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో సమావేశమయ్యారు. వీరిద్దరు ప్రత్యేకంగా భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం కోసం సీఎం కేసీఆర్ రాజ్భవన్కు వెళ్లారు. అంతేకాదు, అక్కడ గవర్నర్ తమిళిసైతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ భేటీ గురించి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. కానీ, ఇందుకు సంబంధించి కొన్ని విశ్వసనీయవర్గాల నుంచి కీలక సమాచారం అందింది. గవర్నర్ తమిళిసైతో కేసీఆర్ భేటీలో పెండింగ్లో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీల గురించి, పెండింగ్లో ఉన్న ఇతర బిల్లులపై ప్రస్తావన వచ్చినట్టు తెలిసింది. సుమారు 20 నిమిషాలపాటు ఈ భేటీ సాగింది. భేటీ అనంతరం, మంత్రిగా పట్నం మహేందర్ ప్రమాణం చేశారు. అనంతరం, వారంతా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో కలిసి గ్రూప్ ఫొటో దిగారు.
Also Read: ఆడబిడ్డలను రక్షించడానికి ఎన్కౌంటర్లు అవసరం: బీజేపీ నేత సువేందు
గవర్నర్ కోటాలో సీఎం కేసీఆర్ ఇటీవలే ఇద్దరు నేతలను ఎంచుకున్న సంగతి తెలిసిందే. కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. సీఎం కేసీఆర్ సారథ్యంలోని క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయానికి గవర్నర్ తమిళిసై ఇంకా ఆమోద ముద్ర వేయాల్సి ఉన్నది. అలాగే, ఆర్టీసీ బిల్లు గురించీ ఇంకా న్యాయ నిపుణుల నుంచి సమాచారం తెలుసుకుంటామని గవర్నర్ బిల్లును పెండింగ్లోనే ఉంచారు. వీటితోపాటు గతంలోనూ మరో మూడు బిల్లులు పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే.
