‘ఐఏఎస్ లు గొర్రెలనే లెక్కపెట్టలేరు’
ఐఏఎస్ లను ఈ మాట ఎవరన్నా అంటే ఇంకేమైనా ఉందా అంతా ఏకమై అతడికి భవిష్యత్తు కూడా లేకుండా చేస్తారు... కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ... కలెక్టర్ల ముందే ఆ మాట అనేశారు... మరి దానికి వారు ఎలా స్పందించారంటే.....
తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలు తూటాల్లా ఉంటాయి. ఎప్పుడ ఎవరిని ఎక్కడ ఎలా మాటలతో పడగొట్టాలో ఆయనకు తెలిసినంతగా మరే రాజకీయ నాయకుడికి తెలియదు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ మాటలతోటే సమైఖ్యాంధ్ర నేతలను ఓ ఆట ఆడుకున్నారు. అంతేకాదు టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి ప్రజలను తీసుకొచ్చేలా తన మాటలే పెట్టుబడిగా నిరంతర పోరాటం చేశారు. ఉద్యమానికి తన మాటలతో కొత్త ఊపును తీసుకొచ్చారు.
పొడుపు కథలతో, సామెతలతో చెప్పాలనుకున్న విషయాన్ని నిరక్షరాస్యులకు కూడా చాలా చక్కగా అర్థమ్యేలా చెప్పడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా.
ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కేసీఆర్ అవసరమొచ్చినప్పుడు తన మాటల చాతుర్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.
మొన్న ఓ పిట్టకథ చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పనితీరును కొనియాడారు.
ఈ రోజు ప్రగతి భవన్ లో కలెక్టర్లతో సమావేశం సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ‘యాదవులకు అనుభవమే పెద్ద చదువు, మందలో ఉన్న ప్రతి గొర్రెను లెక్క పెట్టడం, గుర్తుపట్టడం కాపరికి ఉన్న ప్రత్యేక నైపుణ్యం అని కొనియాడారు.
అంతటితో ఆగకుండా అలాంటి నైపుణ్యం ఐఏఎస్ చదివిన మీకు కూడా ఉండదని కుంబడద్దలు కొట్టారు. దీంతో అక్కడ ఉన్న కలెక్టర్లు అందరూ పెద్దపెట్టున నవ్వేశారు.