డ్రామాలాడుతున్నారా?: వీఆర్ఏ సంఘం నాయకులపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
వీఆర్ఏ సంఘం నేతలపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ పర్యటనలో ఉన్న కేసీఆర్ను కలిసిన వీఆర్ఏలు వినతిపత్రం ఇవ్వాలని చూశారు. అయితే వీఆర్ఏల వినతిపత్రాన్ని స్వీకరించని కేసీఆర్.. దానిని వారిపైకే విసిరివేశారు.
వీఆర్ఏ సంఘం నేతలపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు రెండు నెలలకు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు పోరాటాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నేడు వరంగల్ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ను వీఆర్ఏ సంఘం నాయకులు కలిశారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాని కోరుతూ వారు సీఎం కేసీఆర్ వినతి పత్రం అందించగా.. ఆయన దానిని స్వీకరించలేదు. వీఆర్ఏల వినతి పత్రాన్ని వారిపైకే విసిరివేశారు. డ్రామాలాడుతున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరంగల్ పర్యటనకు వెళ్లిన ములుగు రోడ్డులో ప్రతిమ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిని ప్రారంభించారు. అనంతరం వరంగల్ లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పురోగతిని కేసీఆర్ పరిశీలించారు. తర్వాత టీఆర్ఎస్ సీనియర్ నేత, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి కేసీఆర్ చేరుకున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకుంటున్న కెప్టెన్ లక్ష్మీ కాంతారావును కేసీఆర్ పరామర్శించారు.
Also Read: తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపొందుతోంది.. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ లక్ష్యం.. : సీఎం కేసీఆర్
కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి కేసీఆర్ వస్తున్న విషయం తెలుసుకున్న వీఆర్ఏ సంఘం నాయకులు ఆయనను కలిసేందుకు అక్కడికి చేరుకున్నారు. ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేసీఆర్ కి వినతి పత్రం అందించారు. అయితే ఈ క్రమంలోనే కేసీఆర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. సీఎం కేసీఆర్ రోడ్డుమార్గంలో హైదరాబాద్ నుంచి వరంగల్కు వెళ్తున్న సమయంలో జనగామ వద్ద వీఆర్ఏల ఫ్లకార్డులు ప్రదర్శించారు.
ఇక, కేటీఆర్తో వీఆర్ఏలు జరిపిన చర్చలు ఫలించలేదు. ఈ నెల 20వ తేదీన వీఆర్ఏ ప్రతినిధులతో చర్చలు జరిపిన కేటీఆర్.. వీఆర్ఏలకు ఇచ్చిన హామీల అమలుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. త్వరలోనే వీఆర్ఏల సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పారు. ప్రభుత్వం, వీఆర్ఏలు వేర్వేరు కాదని పేర్కొన్నారు. వీఆర్ఏలో ఆందోళనలు విరమించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అయితే పూర్తి స్థాయి హామీ లభించకపోవడంతో వీఆర్ఏలు నిరసనను కొనసాగిస్తున్నారు.