నూతన సచివాలయం ప్రారంభోత్సవం.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశానికే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
![CM KCR extends greetings on telangana new secretariat inauguration ksp CM KCR extends greetings on telangana new secretariat inauguration ksp](https://static-ai.asianetnews.com/images/01gxzyv02qgpw4zh2dg6kh1k7d/-cm-kcr-jpg_363x203xt.jpg)
అనేక త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామన్నారు సీఎం కేసీఆర్. దేశానికే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజల ఆత్మగౌరవం, ఆకాంక్షలను ఇనుమడింపజేసేలా కొత్త సచివాలయం నిర్మించుకున్నామని కేసీఆర్ అన్నారు. యావత్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప సందర్భమని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నూతన సచివాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్.
ఇదిలా ఉంటే.. ప్రారంభోత్సవానికి సంబంధించి కార్యక్రమాల షెడ్యూల్ను విడుదలను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. తొలుత ఉదయం 6 గంటలకు సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ యాగంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1.20 నుంచి 1.30 గంటల మధ్య పూర్ణాహుతి కార్యక్రమం చేయనున్నారు. ఆ తర్వాత నూతన సచివాలయాల ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్ చేతులపై జరుగనున్నది.
Also Read: తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం..రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే రూట్లలో అంటే..?
ఆ తరువాత నేరుగా 6వ అంతస్తులో వున్న తన ఛాంబర్లో సీఎం కేసీఆర్ అడుగుపెట్టనున్నారు. మధ్యాహ్నం 1.58 నుంచి 2.04 గంటల మధ్య అధికారులు తమతమ చాంబర్లలో అడుగుపెడుతారు. ఈ సమయంలోనే ఒక ఫైల్ మీద సంతకం చేయాలని సాధారణ పరిపాలన శాఖ నుంచి మంత్రులు, అధికారులకు ఆదేశాలు వచ్చాయట. అనంతరం 2.15 నిమిషాలకు సీఎం కేసీఆర్ ప్రసంగం ఉండనున్నది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని శాఖల హెచ్ వోడీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్లు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మున్సిపల్ మేయర్లు తదితరులు పాల్గొంటారని సమాచారం. ఈ కార్యక్రమానికి సుమారు 2500 మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కొత్త సచివాలయంలో పలు భద్రతా చర్యలు చేపట్టారు.
మరోవైపు.. సచివాలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి రాత్రి 8 గంటల వరకు హుస్సేన్ సాగర్, సైఫాబాద్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు వుంటాయని నగర ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు. ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్క్, నెక్లెస్ రోడ్డును పూర్తిగా మూసివేస్తున్నామని.. అలాగే వీఐపీల రాకపోకల సందర్భంగా పీవీ విగ్రహం, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ వరకు ట్రాఫిక్ను నిలిపివేయడం, మళ్లింపులు వుంటాయని నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ నుంచి అనుమతి లేదని పేర్కొన్నారు. లోయర్ ట్యాంక్ బండ్, కవాడిగూడ మీదుగా ఆర్టీసీ బస్సులను మళ్లిస్తామని సీపీ చెప్పారు. ఆహ్వానితులు తమ పాస్లను కార్లకు అతికించుకోవాలని.. వీరి కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు సురేంద్రబాబు తెలిపారు.