యురేనియం తవ్వకాలకు అనుమతివ్వం: అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్
యురేనియం తవ్వకాల గురించి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎవ్వరికీ ఏ విధమైన అనుమతి ఇవ్వలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అంతేకాకుండా భవిష్యత్లో సైతం అనుమతి ఇచ్చే ఆలోచన లేదని తేల్చి చెప్పారు
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన యురేనియం తవ్వకాలపై తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. యురేనియం తవ్వకాల గురించి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎవ్వరికీ ఏ విధమైన అనుమతి ఇవ్వలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
అంతేకాకుండా భవిష్యత్లో సైతం అనుమతి ఇచ్చే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. నల్లమల అడవులను ఎట్టి పరిస్ధితుల్లోనూ నాశనం కానివ్వమని.. అనుమతులు ఇవ్వొద్దని చెబితే కూడా కాంగ్రెస్ పార్టీ 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుమతులు మంజూరు చేసిందని సీఎం గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే తవ్వకాలు ప్రారంభమయ్యాయని కేసీఆర్ తెలిపారు. తవ్వకాలు జరిపితే శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు కలుషితమై నాశనమయ్యే పరిస్ధితి వస్తుందని సీఎం పేర్కొన్నారు.
వీటన్నింటి దృష్ట్యా ఎట్టిపరిస్ధితుల్లోనూ యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వమని తేల్చి చెప్పారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని.. దీనిపై ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
యురేనియం తవ్వకాలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు సభలో సోమవారం తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని... కేంద్ర ప్రభుత్వం దిగిరాని పక్షంలో కలిసి ఉద్యమిద్దామని చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు.