సిరిసిల్ల జిల్లాలో టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు.. ఛైర్పర్సన్పై సొంత కౌన్సెలర్ల తిరుగుబాటు, కేటీఆర్ చెప్పినా
తెలంగాణలో ఇటీవల టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. మంత్రి కేటీఆర్ చెప్పినా వీరిలో ఏ మార్పు రాలేదు.
రాజన్న సిరిసిల్ల (rajanna sircilla) టీఆర్ఎస్ (trs) నేతల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. మున్సిపల్ ఛైర్పర్సన్ పై సొంత పార్టీ కౌన్సెలర్లే తిరుగుబాటు చేశారు. చైర్పర్సన్ కళా భర్త పాణి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ఆమె కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కౌన్సెలర్లు. మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేసేందుకు 25 మందికి పైగా నేతలు హైదరాబాద్ కు బయల్దేరినట్లుగా సమాచారం. స్వయంగా మంత్రి కేటీఆర్ ఫిర్యాదు చేసినా నేతలు మాత్రం మారలేదు.
ఇకపోతే.. నాగర్ కర్నూలు జిల్లా (nagar kurnool district) కొల్లాపూర్లో (kollapur) అధికార టీఆర్ఎస్లో వర్గపోరు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (jupally krishna rao) , ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి (beeram harshavardhan reddy) బహిరంగ చర్చకు సిద్దమైన నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఆదివారం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి జూపల్లి.. ఎమ్మెల్యే హర్షవర్దన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను సంపాదించిన పేరు, ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మంచి చేసి పేరు సంపాదించాలని.. కానీ చౌకబారు రాజకీయాలెందుకు అని ప్రశ్నించారు. తనపై చేసిన ఆరోపణలపై చర్చకు సిద్దమా? అని ఎమ్మెల్యేకు సవాలు చేశానని గుర్తుచేశారు. ధైర్యముంటే అంబేడ్కర్ చౌరస్తాకు రమ్మని 15 రోజుల సమయమిచ్చానని చెప్పుకొచ్చారు. అయితే హర్షవర్దన్ రెడ్డి అంబేడ్కర్ చౌరస్తాలో కాకుండా తన ఇంటికొస్తాననని అన్నారని తెలిపారు.
Also Read:తాండూరు: రోహిత్ రెడ్డి ఫ్లెక్సీలు కాల్చివేత.. ఎమ్మెల్సీ వర్గీయుల ఇంటిపై ఎమ్మెల్యే అనుచరుల దాడి
ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి కోసం ఉదయం నుంచి ఎదురుచూస్తున్నానని.. కానీ ఇప్పటివరకు రాలేదని జూపల్లి చెప్పారు. తన వద్దకు వచ్చేందుకు ధైర్యం చాలక హర్షవర్దన్ రెడ్డి పోలీసుల చేత అరెస్ట్ చేయించుకున్నారు. అతని వర్గీయులకు మాత్రమే హర్షవర్దన్ రెడ్డి మేలు చేశారని విమర్శించారు. తనది మచ్చలేని చరిత్ర కాబట్టే.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. తాను ఏ బ్యాంకు నుంచి తీసుకున్నా రుణం కూడా ఎగగొట్టలేదని చెప్పారు. తాను అప్పులు చేసి వ్యాపారం చేశానని.. తప్పులు చేయలేదని తెలిపారు. హర్షవర్దన్పై చేసిన ఆరోపణలను రుజువు చేస్తానని చెప్పారు. తాను చేసిన సవాలకు 100 శాతం కట్టుబడి ఉన్నట్టుగా వెల్లడించారు.