కేసీఆర్పై సినీ నటి కుష్బూ సంచలనం
కేసీఆర్ సీఎం కాదు.... కమీషన్ మాన్ అంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, సినీ నటి కుష్బూ సంచలన విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: కేసీఆర్ సీఎం కాదు.... కమీషన్ మాన్ అంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, సినీ నటి కుష్బూ సంచలన విమర్శలు గుప్పించారు. వందల కోట్ల బంగ్లాలో నివాసం ఉండే కేసీఆర్ నవాబ్ ను తలపిస్తున్నాడని ఆమె ఆరోపించారు.
మంగళవారం నాడు ఆమె హైద్రాబాద్ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ జీరో కావడం ఖాయమన్నారు.మావోయిస్టుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆమె తప్పుబట్టారు. ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తున్నారని కుష్బూ ఆరోపించారు. గతంలో జరిగిన శృతి ఎన్కౌంటర్ను ఆమె ప్రస్తావించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను కేసీఆర్ అమలు చేయలేదన్నారు.
దళితుడిని సీఎం చేస్తానని ఇచ్చిన హమీలను అమలు చేయలేదని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీలు ప్రేమలో పడ్డాయని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ 11 మంది మహిళలకు టికెట్లు ఇచ్చిందన్నారు. కానీ టీఆర్ఎష్ కేవలం ముగ్గురికి మాత్రమే టికెట్లను కేటాయించిందని తెలిపారు. మహిళలకు వ్యతిరేకంగా కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తోందని ఆమె విమర్శలు గుప్పించారు.మహిళలంటే కేసీఆర్ కూతురేనా అని ఆమె ప్రశ్నించారు.
ప్రతిపక్షం అంటే కేసీఆర్ కు కనీస గౌరవం లేదన్నారు. అవినీతిలో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. నిరుద్యోగుల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హస్తం ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుందని ఆమె అభయమిచ్చారు.