Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవి.. ఇకపై ఇలాంటి పనులు చేయకండి: జగన్‌తో భేటీపై సీపీఐ నారాయణ హితబోధ

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి వన్ టు వన్ భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఈ సమావేశం చుట్టూ అనేక ఆరోపణలు, అనుమానాలు వచ్చాయి. వాటికి చిరంజీవి ప్రత్యేక వివరణ ఇచ్చి రాజ్యసభ సీటు ఆఫర్ వచ్చిందన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ వివరణకు ప్రతిస్పందనగా సీపీఐ నారాయణ ఓ వీడియో విడుదల చేశాడు. చిరంజీవి ఒంటరిగా వెళ్లడం సరికాదని, సినీ ఇండస్ట్రీ పబ్లిక్ సమస్య కాబట్టి.. ఆ ఇండిస్ట్రీకి చెందిన అసోసియేషన్స్‌తో మాట్లాడి కలుపుకుని పోవాల్సిందని అభిప్రాయపడ్డారు. అలా కాకుండా.. ఆగమేఘాల మీద ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చి వన్ టు వన్ భేటీ అయితే.. అనుమానాలు రావడం సహజమేనని, ఇకపై అాలాంటి పనులు చేయకండి అంటూ చిరుకు హితబోధ చేశారు.
 

chiranjeevi one to one meeting with CM jagan is wrong.. do not do it agains says CPI leader Narayana
Author
Hyderabad, First Published Jan 15, 2022, 5:50 AM IST

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi).. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్ రెడ్డి(AP CM Jagan)తో వన్ టు వన్ భేటీ(One to One Meet) కావడం ఉభయ రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. సనీ పరిశ్రమ(Film Industry) సమస్యలపై మాట్లాడటానికి పరిశ్రమ బిడ్డగా మాత్రమే వెళ్లానని చిరంజీవి పేర్కొన్నా.. ఈ భేటీపై అనేక అనుమానాలు వచ్చాయి. చిరంజీవికి సీఎం జగన్ రాజ్యసభ సీటు ఆఫర్ చేశాడనే ప్రచారం అందులో ప్రధానమైంది. ఈ ఆరోపణలకు చెక్ పెట్టడానికి చిరంజీవి ప్రత్యేక వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఆ ఆరోపణలు ఖండించారు. తమ సమావేశంలో రాజకీయాలేవీ మాట్లాడలేదని, కేవలం సినీ పరిశ్రమ సమస్యలపై మాత్రమే చర్చించినట్టు స్పష్టం చేశారు. తాను రాజకీయాలను పూర్తిగా వదిలేశారని, పదవులను ఆశించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ.. చిరంజీవిని తప్పుబడుతూ పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Leader Narayana) హితబోధ చేశారు. చిరంజీవి ఇకపై ఇలాంటి పనులు చేయకండి అంటూ సుతిమెత్తగా విమర్శలు చేశారు.

సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్య కాబట్టి, వారిని కలుపుకుని పోకుండా మీకు మీరుగా ఆగమేఘాల మీద ఒక్కరే విజయవాడకు వచ్చి ముఖ్యమంత్రితో వన్ టు వన్ (ఇద్దరే ముఖాముఖిగా) భేటీ కావడమేంటని అడిగారు. వ్యక్తిగత సమస్య అయితే.. అలా మాట్లాడటంలో తప్పులేదు కానీ, అది సినీ ఇండస్ట్రీ సమస్య అంటే.. అది సినీ ఇండస్ట్రీ పబ్లిక్ సమస్య కాబట్టి.. వారిని కలుపుకుపోయి సీఎంతో సమావేశం కావాల్సిందని అన్నారు. అలా వన్ టు వన్ సమావేశం అయితే. .అనుమానాలు రాకుండా ఉంటాయా? అవి రావడం సహజమే కదా అంటూ చురకలు అంటించారు. ప్రస్తుతం తనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని ఆ భేటీపై వచ్చిన ఆరోపణలు ఖండిస్తూ చిరంజీవి చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా సీపీఐ జాతీయ కార్యదర్శి ఓ వీడియో రిలీజ్ చేశాడు.

మెగాస్టార్ చిరంజీవి తనకు మంచి స్నేహితుడని, ఆయన ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారని ఆ వీడియోలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తాను రాజ్యసభ సీటు ఆశించలేదని, అంతా అపార్థం చేసుకున్నారంటూ బాధతతో ఆయన ఓ ట్వీట్ చేశారని పేర్కొన్నారు. అయితే, అది నిజమే కావచ్చు.. చిరంజీవి బాధ నిజమే కావచ్చు అని అన్నారు. కానీ, అది చిరంజీవి సొంత సమస్య కాదని, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పబ్లిక్ సమస్య అని వివరించారు. సినిమా పరిశ్రమ సమస్య అన్నప్పుడు.. ఆ పరిశ్రమలో కొన్ని అసోసియేషన్లు ఉన్నాయని, వాటిని కలుపుకుని సీఎం జగన్‌తో సమవేశం కావాల్సిందని అన్నారు. అలా కాకుండా, వాటితో సంబంధం లేకుండా ప్రత్యేక విమానంలో ఆగమేఘాల మీద విజయవాడకు వచ్చి సీఎంను పర్సనల్‌గా వన్ టు వన్ భేటీ అయ్యారని తెలిపారు. తాను ఒక టీమ్‌తో వెళ్లలేదని అన్నారు.

సీఎం జగన్‌తో చిరంజీవి ఏం మాట్లాడారో ఎవరికైనా ఎలా తెలుస్తుందని సీపీఐ నారాయణ ప్రశ్నించారు. అందుకే ఈ వివాదం ఎదురైందని వివరించారు. నిజంగా సినీ ఇండస్ట్రీ సమస్య అయితే.. అసోసియేషన్స్‌తో మాట్లాడాలని పేర్కొన్నారు. అలాకాకపోతే.. వ్యక్తిగత సమస్యలు మాట్లాడుకోవచ్చునని తెలిపారు. సీఎం జగన్‌తో భేటీ అయింది ఒక్కడే కాబట్టి.. ఫిలిం ఇండస్ట్రీకి ల్యాండ్ కావాలా? రాజ్య సభ సీటు కావాలా? వంటి అనుమానాలు సహజంగానే వస్తాయని అన్నారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేకపోవచ్చునని, చిరంజీవి స్వయంగా చెబుతున్నాడు కాబట్టి.. ఆ కథనాలు అవాస్తవాలే కావొచ్చు అని చెప్పారు. కానీ, అలాంటి ఘటనలు ఊహగానాలకు దారి తీస్తాయా? లేదా? అని అడిగారు. అలా వెళ్లడం పొరపాటు కాదా? అని ప్రశ్నించారు. అది సొంత సమస్య కానప్పుడు అసోసియేషన్స్‌ను కలుపుకుపోకుండా ఆయన ఒక్కడే వెళ్లి ఏ విధంగా మాట్లాడాతారు? అంటూ అడిగారు. ఎలా పరిష్కారం చేస్తారు? అంటూ పేర్కొన్నారు. అందుకే అనుమానాలు వచ్చాయని, కాబట్టి, ఇలాంటి పనులు ఇకపై చేయకండి అంటూ హితబోధ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios