బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్... భారీగా పడిపోయిన చికెన్ ధరలు..!
రోగ నిరోధక శక్తి కోసం చికెన్ తినక తప్పదని అందరూ చెప్పడంతో.. అందరూ గుడ్లు, చికెన్ విపరీతంగా తినడం మొదలుపెట్టారు. దీంతో.. మళ్లీ ఆకాశాన్నంటాయి.
తెలంగాణ రాష్ట్రంలో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. చికెన్ ధరలు భారీగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు కేజీ చికెన్ రూ.250 వరకు పలకగా.. ఈ బర్డ్ ఫ్లూ దెబ్బకు దిగి వచ్చాయి. దీంతో చికెన్ వ్యాపారుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
తొలుత కరోనా మహమ్మారి దేశంలో వ్యాపించిన కొత్తలోనూ చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. తర్వాత రోగ నిరోధక శక్తి కోసం చికెన్ తినక తప్పదని అందరూ చెప్పడంతో.. అందరూ గుడ్లు, చికెన్ విపరీతంగా తినడం మొదలుపెట్టారు. దీంతో.. మళ్లీ ఆకాశాన్నంటాయి. అయితే.. ఆ పెరిగిన ధరకు ఇప్పుడు.. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ పట్టుకుంది. దీంతో.. ప్రజలు ఇప్పుడు చికెన్ పేరు చెబితేనే భయపడిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ లేకపోయినప్పటికీ... పక్క రాష్ట్రాల ప్రభావం భారీగానే ఉంది. పొరుగు రాష్ట్రాల్లోచికెన్ అమ్మకాలపై నిషేధాలు విధించడం... కోళ్లను చంపివేయడంతో రాష్ట్ర ప్రజలు సైతం చికెన్ తినేందుకు భయపడుతున్నారు. ఈ కొత్త వైరస్ సమయంలో చికెన్ తినకపోవడం మంచిదని భావిస్తున్నారు.
వారం క్రితం వరకు 250 రూపాయలపైనే ఉన్న కిలో చికెన్... ఇప్పుడు 180, 160 రూపాయలకు పడిపోయింది. పరిస్థితి ఇలానే ఉంటే.. ధరలు మరింత తగ్గుతాయంటున్నారు వ్యాపారులు. వారానికోసారి చికెన్ తినే నాన్వెజ్ ప్రియులు .. ఇప్పుడు అలా కూడా తినేందుకు భయపడుతున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ అంటేనే భయపడుతున్నారు. పక్క రాష్ట్రాల్లో ఇప్పటికే చికెన్ అమ్మకాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. కోళ్లతో పాటు ఇతర పక్షులు, చేపల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు.