హైదరాబాద్కు చేరుకున్న చే గువేరా కూతురు, మనవరాలు.. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘనస్వాగతం..
క్యూబా మార్క్సిస్ట్ విప్లవ నాయకుడు ఎర్నెస్టో చే గువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ప్రొఫెసర్ ఎస్తెఫానియా గువేరా హైదరాబాద్కు చేరుకున్నారు.
క్యూబా మార్క్సిస్ట్ విప్లవ నాయకుడు ఎర్నెస్టో చే గువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ప్రొఫెసర్ ఎస్తెఫానియా గువేరా హైదరాబాద్కు చేరుకున్నారు. ప్రస్తుతం భారతదేశ పర్యటనలో ఉన్న అలైదా గువేరా, ఆమె కుమార్తె ఎస్తెఫానియా గువేరా.. ఈరోజు ఉదయం కోల్కత్తా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టుకు చేరుకున్న వీరికి అధికారులు, వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు స్వాగతం పలికారు. వారు ఎయిర్పోర్టు నుంచి నేరుగా సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి వెళ్లారు.
ఇక, సాయంత్రం 4 గంటలకు నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా ఆధ్వర్యంలో రవీంధ్రభారతిలో జరిగే ‘క్యూబా సంఘీభావ సభ’కు అలైదా గువేరా, ఎస్తే ఫానియా ముఖ్య అతిథులుగా హాజరవుతారు. ఈ సభకు బీజేపీ, ఎంఐఎం దూరంగా ఉండనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ మాజీ సీఎస్ మాధవరావు, తెలంగాణ స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్, ప్రొఫెసర్ శాంతాసిన్హా, ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ తో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నాయకులు, పలు ప్రజా సంఘాల నాయకులు హాజరుకానున్నారు