అసమ్మతి సెగ.. భారీ భద్రత నడుమ మంత్రి ప్రచారం
ములుగులో మంగళవారం ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో తిరుగుబాటు నేతలు చందులాల్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి అజ్మీరా చందులాల్ కి అసమ్మతి సెగ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించారు. టికెట్ దక్కిన అభ్యర్థులు ప్రచారాలు చేపడుతుండగా.. దక్కని వారు మాత్రం కోపంతో రగిలిపోతున్నారు. ప్రచారానికి వచ్చిన వారిపై నిరసనలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
తాజాగా చందులాల్ కి కూడా ఈ అనుభవం ఎదురైంది. ములుగులో మంగళవారం ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో తిరుగుబాటు నేతలు చందులాల్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.తన తండ్రి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారన్న కోపంతో చందులాల్ కుమారుడు ప్రహ్లాద్ తన అనుచరులతో కలిసి అసమ్మతి నేతల వాహానాలను ఆదివారం నాడు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
మంత్రి కుమారుడి తీరుకు వ్యతిరేకంగా ప్రచారానికి వచ్చిన చందులాల్కు తిరుగుబాటు నేతల నుంచి అస్మమతి ఎదురైంది. దీంతో ములుగులో టీఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. అసమ్మతి వర్గం, చందులాల్ వర్గాల మధ్య వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. ములుగులో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో.. పోలీసుల భద్రత నడుమ చందులాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.