తెలుగుదేశం పార్టీని, తెలుగు జాతిని ఎవ్వరూ విడదీయలేరని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు.
40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ (ntr) పెట్టిన తెలుగుదేశం పార్టీ (telugu desam party) చరిత్ర సృష్టించిందన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవాలను (tdp formation day) పురస్కరించుకుని హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో (old mla quarters hyderabad) ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు (chandrababu naidu) నివాళి అర్పించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. టీడీపీ ముందు, టీడీపీకి తర్వాత అన్నట్లుగా వ్యవహరించాల్సిన అవసరం వున్నారు. సంక్షేమం, అభివృద్ధి, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది ఎన్టీ రామారావు అని చంద్రబాబు ప్రశంసించారు. 40 సంవత్సరాలలో ఎన్నో చరిత్రలు సృష్టించామని.. ఎన్నో రికార్డులు బ్రేక్ చేశామని ఆయన గుర్తుచేశారు. మళ్లీ ఇవాళ జాతి పునరంకితం కావాల్సిన సందర్భం, యువత ముందుకు రావాల్సిన సందర్భం వుందన్నారు. తెలుగుదేశం పార్టీని, తెలుగు జాతిని ఎవ్వరూ విడదీయలేరని చంద్రబాబు అన్నారు. తెలుగు వారు ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ వుంటుందని ఆయన పేర్కొన్నారు.
అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు.. పార్టీ కార్యకర్తలు అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నలభై సంవత్సరాల క్రితం 1982, మార్చి 29న ఎన్టీఆర్ చేతుల మీదుగా తెలుగుదేశం ఆవిర్భావం....ఒక రాజకీయ అనివార్యం. కొందరు వ్యక్తుల కోసమో... కొందరికి పదవుల కోసమో ఏర్పడిన పార్టీ కాదు మన తెలుగుదేశం. ప్రజల కోసం... ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం. పేదలకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం....ఈ 40 ఏళ్లలో సామాన్య ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చింది.
కొందరికే పరిమితం అయిన అధికారాన్ని అన్ని వర్గాలకు పంచింది. తెలుగుదేశం అంటేనే అభివృద్ధి..సంక్షేమం. సంస్కరణల ఫలితాలను గ్రామ స్థాయికి అందించిన చరిత్ర టీడీపీదే.పాలనపై పాలకులను ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు నేర్పింది తెలుగుదేశమే. ప్రాంతీయ పార్టీ గా ఉన్నా....జాతీయ భావాలతో సాగే పార్టీ టీడీపీ. పార్టీ చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తుకుతెచ్చేలా తెలుగుదేశం 40 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించండి. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఈ వేడుకలు ఉండాలి. రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అవసరం ఏంటో ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు సాగాలి’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
