బేగంపేట విమానాశ్రయాన్ని చంద్రబాబే నిర్మించారట
దేశంలోనే నెంబర్ వన్ గా పేరొందిన బేగంపేట విమానాశ్రయాన్ని టీడిపి హయాంలోనే నెలకొల్పామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబుకున్నారు.
హైదరాబాద్: దేశంలోనే నెంబర్ వన్ గా పేరొందిన బేగంపేట విమానాశ్రయాన్ని టీడిపి హయాంలోనే నెలకొల్పామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబుకున్నారు. ఒకప్పుడు తాగు నీరు లేని పరిస్థితి నుంచి హైదరాబాద్ నేడు మహానగరంగా మారిందంటే దాని వెనక టీడీపి ప్రభుత్వ శ్రమ, కష్టం ఉందని అన్నారు.
బేగంపేట విమానాశ్రయాన్ని టీడీపి హాయంలో నెలకొల్పామనే చంద్రబాబు ట్విటర్ పోస్టుపై నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. అయితే, చేసిన తప్పును గుర్తించి ఆ తర్వాత బేగంపేట విమానాశ్రయానికి సంబంధించిన విషయాన్ని ప్రస్తావించకుండా మరో ట్వీట్ చేశారు.
వాస్తవానికి బేగంపేట విమానాశ్రయాన్ని 1930లో నిజాం నవాబు కట్టించారు. దాన్ని గుర్తు చేస్తూ అవును... నిజాం రాజు మీ దోస్తే కదా అని నెటిజన్లు సెటైర్లు వేశారు.
నిజాం నవాబు నిర్మించిన బేగంపేట విమానాశ్రయం దక్కన్ ఎయిర్ వేస్ పేరుతో కొనసాగుతూ వచ్చింది. 1937లో మొదటి టెర్మినల్ నిర్మించగా, 1972లో కొత్త టెర్మినల్ నిర్మించారు. 2008లో శంషాబాద్ విమానాశ్రయం ప్రారంభమైంది.
ప్రస్తుతం బేగంపేట విమానాశ్రయాన్ని ఏవియేషన్, మిలటరీ శిక్షణ కోసం, వివిఐపిల రాకపోకల కోసం వాడుతున్నారు.