హైద్రాబాద్ నుండి మరో కరోనా వ్యాక్సిన్: 30 కోట్ల డోసులు ఆర్డర్ చేసిన కేంద్రం
హైద్రాబాద్ కేంద్రంగా ఉన్న బయోలాజికల్ ఈ కంపెనీ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 30 కోట్ల వ్యాక్సిన్ కు ఆర్డర్ చేసింది.
న్యూఢిల్లీ: హైద్రాబాద్ కేంద్రంగా ఉన్న బయోలాజికల్ ఈ కంపెనీ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 30 కోట్ల వ్యాక్సిన్ కు ఆర్డర్ చేసింది. ఈ వ్యాక్సిన్ ఇంకా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తుంది. ఈ క్లినికల్ ట్రయల్స్ ఆధారంగా వ్యాక్సిన్ ను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకొనేందుకు డీసీజీఐ అనుమతిచ్చే అవకాశం ఉంది. డీసీజీఐ అనుమతి తర్వాతే ఈ వ్యాక్సిన్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.
మేకిన్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న బయోలాజికల్ ఈ కంపెనీకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అడ్వాన్స్ గా రూ. 1500 కోట్లు చెల్లించింది. ఇండియాకు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను తయారు చేస్తోంది. బయోలాజికల్ ఈ సంస్థ కరోనా వ్యాక్సిన్ కు ఆమోదం లభిస్తే దేశీయంగా కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న రెండో ఫార్మా సంస్థగా పేరుగాంచనుంది.
ఈ ఏడాది ఆగష్టు నుండి డిసెంబర్ వరకు బయోలాజికల్ ఈ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖాధికారులు తెలిపారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న సమయంలో వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. క్లినికల్ ట్రయల్స్ తొలి దశ, రెండో దశలో మంచి ఫలితాలు వచ్చినట్టుగా ఆ కంపెనీ ప్రకటించింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ సాగుతున్నాయని ఆ సంస్థ తెలిపింది.
పుణెకు చెందిన సీరం సంస్థ కోవిషీల్డ్ ను ఉత్పత్తి చేస్తోంది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతిచ్చింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఈ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయనుంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ రష్యా నుండి దిగుమతి చేసుకొంటున్నారు. భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ ను ఉత్పత్తి చేస్తోంది. ఫైజర్, మోడార్నో కంపెనీలతో కూడ కేంద్రం చర్చలు జరుపుతోంది.బయోలాజికల్ ఈ సంస్థకు టీకాల ఆర్డర్ ఇవ్వడం స్వదేవీ వ్యాక్సిన్ తయారీదారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాల్లో భాగమని కేంద్రం తెలిపింది. బయోలాజికల్ ఈ సంస్థకు కేంద్రం రూ. 100 కోట్ల ఆర్ధిక సహాయం చేసింది.