తెలుగు రాష్ట్రాల్లో 2026 తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన: పార్లమెంట్లో కేంద్రం కీలక ప్రకటన
తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ 2026 తర్వాతే చేపడతామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానం ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో ఉండదు అని స్పష్టమైంది. 2026 తర్వాతే ఆ ప్రక్రియ చేపడతామని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించాల్సి వుంది. ‘ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలను 153 నియోజకవర్గాలుగా పెంచాల్సిన అవరం ఉంది. ఎప్పుడు పెంచుతారు?’ అంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానం ఇచ్చారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 170లో చెప్పినట్లు 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని నిత్యానంద్ రాయ్ తెలిపారు. నియోజక వర్గాల పునర్విభజన జరిగితే ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 నియోజక వర్గాలను 225కు పెంచుతారు. అలాగే తెలంగాణలోని 119 నియోజకవర్గాలను 153కు పెంచుతారు.