ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ సంతృప్తి: రజత్ కుమార్
రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల సంఘం సంతృప్తి చెందిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ చెప్పారు.ఎన్నికల నిర్వహణ కోసం తాము సర్వసన్నద్దంగా ఉన్నామని చెప్పారు.
హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల సంఘం సంతృప్తి చెందిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ చెప్పారు.ఎన్నికల నిర్వహణ కోసం తాము సర్వసన్నద్దంగా ఉన్నామని చెప్పారు.
శుక్రవారం నాడు ఆయన హైద్రాబాద్లో మీడియాతో మాట్లాడారు. ఓటర్ లిస్ట్లతో పోలింగ్ బూత్ల వారిగా విభజన జరుగుతోందన్నారు. ఓటర్ జాబితాలోని అభ్యంతరాలన్నీ పరిష్కరిస్తామన్నారు.
ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని నిబంధన ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ నెల . 15, 16 తేదీల్లో గ్రామస్థాయిలో పోలింగ్ బూత్ల వారిగా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు ఆయన తెలిపారు. ఈవీఎం మిషన్లు రాగానే వాటిని రాజకీయ పార్టీల సమక్షంలోనే పరిశీలించనున్నట్టు చెప్పారు.
ఈసారి ఎన్నికల్లో వీవీప్యాట్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈవీఎంలపై ఎలాంటి అనుమానాలు వద్దు. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. ఈ నెల 20లోగా రాష్ట్రానికి ఈవీఎంలు వస్తాయన్నారు. 52వేల బ్యాలెట్ యూనిట్లు రాష్ట్రానికి అవసరమన్నారు.
సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారంపైనా నిఘా ఉంటుందన్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈవీఎంలపై ఎలాంటి అనుమానాలు వద్దన్నారు.