సీసీఎస్ ఎస్ఐ సైదులు ఆత్మహత్య
సీసీఎస్ ఎస్ఐ సైదులు సోమవారం నాడు తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్: అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీఎస్ ఎస్ఐ సైదులు సోమవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు. తన నివాసంలోనే ఎస్ఐ సైదులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సైదులు సీసీఎస్ ఎస్ఐ గా పనిచేస్తున్నాడు. ఇంట్లోనే సైదులు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే సైదులు ఆత్మహత్య చేసుకొన్నాడని పోలీసులు చెబుతున్నారు.
2017 బ్యాచ్కు చెందిన సైదులు సీసీఎస్లో విధులు నిర్వహిస్తున్నాడు. మూడు మాసాలుగా సైదులు విధులు నిర్వహిస్తున్నాడు.
ఉద్యోగంలో చేరిన కొత్తలో రోడ్డు ప్రమాదంలో సైదులు గాయపడ్డాడు. దీంతో ఆయన ఎక్కువ సేపు నిలబడి విధులు నిర్వహించే పరిస్థితుల్లో లేడని సైదులు భార్య నీలిమ చెప్పారు.
అయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మొబైల్ కోర్టులో విధులను పొందినట్టుగా నీలిమ మీడియాకు తెలిపారు. మొబైల్ కోర్టులో విధుల నుండి రిలీవ్ కావాలని ఉత్తర్వులు వచ్చిన నుండి తన భర్తలో ఆందోళన కన్పించిందని ఆమె చెప్పారు.
గతంలో కూడ తన భర్త నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా నీలిమ చెప్పారు. తాను పిల్లలను స్కూల్లో దింపి వచ్చే సమయానికి ఉరేసుకొని చనిపోయినట్టుగా ఆమె తెలిపారు.