Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. తెలంగాణ ప్రభుత్వానికి సీబీఐ లేఖ

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ గురువారం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ కేసులో సిట్ విచారణను రద్దు చేసిన హైకోర్టు.. దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. 

cbi letter to telangana govt over brs mlas poaching case
Author
First Published Jan 5, 2023, 6:59 PM IST

తెలంగాణలో ఎమ్మెల్యే కొనుగోలు కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసు విచారణను సిట్ నుంచి సీబీఐకి అప్పగించింది హైకోర్ట్. అయితే సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ తెలంగాణ ప్రభుత్వానికి గురువారం లేఖ రాసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ తెలంగాణ హైకోర్ట్ ఇచ్చిన సర్టిఫైడ్ ఆర్డర్ కాపీ సీబీఐకి చేరింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి సీబీఐ లేఖ రాసింది. మరోవైపు ఎఫ్ఐఆర్ నమోదుకు అన్ని అంశాలను పరిశీలిస్తోంది సీబీఐ. అయితే ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ  తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను హైకోర్ట్  శుక్రవారానికి వాయిదా వేసింది  .

ఇదిలావుండగా... ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐతో  విచారణ చేసేందుకు  తెలంగాణ హైకోర్టు గతేడాది డిసెంబర్‌లో అనుమతి ఇచ్చింది. గతేడాది  అక్టోబర్  26న  నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తూ పోలీసులకు ముగ్గురు పట్టుబడ్డారు.అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు,పినపాక ఎమ్మెల్యే  రేగా కాంతారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి , తాండూరు ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభాలకు గురి చేశారని  పోలీసులకు  ఫిర్యాదు  అందింది.ఈ విషయమై  తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు  మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో  రామచంద్రభారతి,సింహయాజీ,నందకుమార్ లను  పోలీసులు అరెస్ట్  చేశారు. 

ALso REad: సీబీఐ చేతికి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్ట్ తీర్పును సవాల్ చేసిన తెలంగాణ సర్కార్

ఈ కేసు విచారణకు గాను  హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో  సిట్ ను ఏర్పాటు  చేస్తూ  తెలంగాణ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది.అయితే సిట్  తో కాకుండా  సీబీఐ లేదా  స్వతంత్ర దర్యాప్తు  సంస్థతో  విచారణ కోరుతూ  బీజేపీ  పిటిషన్ దాఖలు చేసింది.బీజేపీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తో పాటు మరో నలుగురు ఇదే  డిమాండ్ తో పిటిషన్లను దాఖలు చేశారు.అయితే  టెక్నికల్  అంశాలను  ప్రాతిపదికగా తీసుకున్న  తెలంగాణ హైకోర్టు బీజేపీ సహా  మరొకరి  పిటిషన్ ను కొట్టివేసింది.ఈ కేసును సీబీఐ విచారణ కోరుతూ  మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లను  సీబీఐ పరిగణనలోకి తీసుకుంది. అంతేకాదు  సిట్ దర్యాప్తును నిలిపివేయాలని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ పరిణామాలు తెలంగాణ ప్రభుత్వానికి  షాక్ ను కలిగించాయి.

కాగా... ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక విషయాలు ప్రస్తావించింది హైకోర్ట్. దర్యాప్తు సమాచారం సీఎంకు చేరవేతపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికీ తప్పేనని.. సీఎంకు సాక్ష్యాలు ఎవరిచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని ధర్మాసనం అభిప్రాయపడింది. దర్యాప్తు ఆధారాలు బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదని కోర్ట్ వ్యాఖ్యానించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios