కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిగితే ఫలితం ఉండదు - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
bhatti vikramarka : కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ జరిపిస్తే ఫలితం ఉండదని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు.
![CBI investigation on Kaleswaram will not result - Deputy CM Bhatti Vikramarka..ISR CBI investigation on Kaleswaram will not result - Deputy CM Bhatti Vikramarka..ISR](https://static-ai.asianetnews.com/images/01gtp1pkwrnaj38g9sdfjd92b6/mallu-bhatti-vikramarka-jpg_363x203xt.jpg)
bhatti vikramarka : బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఇంకా ఒప్పందం ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ కు ఏటీఎంలా మారిందని బీజేపీ విమర్శించిందని ఆయన గుర్తు చేశారు. అయినా ఆ పార్టీపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ జరిపితే ఎలాంటి ఫలితమూ ఉండదని తెలిపారు.
ఆదివారం ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివిధ అంశాలపై మాట్లాడారు. తమది ప్రజాస్వామ్య పాలన అని అన్నారు. అందుకే తమ పార్టీపై తిరుగుబాటు జరగదని తెలిపారు. నియంతృత్వ పాలకుల మీదనే తిరుగుబాటు ఉంటుందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ప్రజలు, అధికారులు స్వేచ్చ వచ్చిందని భావిస్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు.
తమ ప్రభుత్వం కేవలం ప్రజలకే జవాబుదారీగా పని చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎవరిపైనా ఒత్తిడి తీసకురాకుండా పరిపాలన సాగిస్తామని చెప్పారు. ఎన్నికల్లో చెప్పినట్టుగా తమ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందనిఅన్నారు. దాని కోసం ప్రణాళికలను రూపొందిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న యూనివర్సిటీలను మరింత బలంగా తయారు చేస్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.