టిఆర్ఎస్ వర్గాల్లో క్యాబినెట్ గుసగుసలు
- టిఆర్ ఎస్ వర్గాల్లో క్యాబినెట్ విస్తరణ చర్చ -
- నాయినిని పార్టీకి, పద్మదేవేందర్ రెడ్డిని హోం కు మారుస్తారట -
- డిప్యూటి స్పీకర్ గా కొండా సురేఖకు అవకాశం ?
ఉన్నట్లుండి తెలంగాణా రాష్ట్ర సమితి వర్గాల్లో క్యాబినెట్ విస్తరణ చర్చ మొదలయింది. క్యాబినెట్ విస్తరణ గురించి గాని లేదా కొంతమందిని పార్టీ పనిలోకి తీసుకుని కొత్త వారికి చోటిచ్చే విషయం గురించిగాని ముఖ్యమంత్రి కెసిఆర్ లేదా తర్వాత అలాంటి విషయాల గురించి మాట్లాడగలిగిన ఐటి మంత్రి కెటి ఆర్ నుంచి ఎలాంటి సంకేతాలు వెలువడ లేదు. అయినా సరే, దీపావళి తర్వాత క్యాబినెట్ లో మార్పులుంటాయనే చర్చ టిఆర్ ఎస్ వర్గాల్లో జోరందుకుంది.
ఈ మధ్య ముఖ్యమంత్రి పలుమార్లు గవర్నర్ నరసింహన్ కలసినపుడు ఈ అంశం చర్చకు వచ్చిందని కూడా చెబుతున్నారు. ముఖ్యమంత్రి క్యాబినెట్ మార్పులకు రెండు కారణాలను ఈ వర్గాలు వూహిస్తున్నాయి. ఒకటి కొత్త జిల్లాలు వచ్చినందున కొన్ని ముఖ్యమయిన జిల్లాలకు క్యాబినెట్లో ప్రాతినిధ్యం కల్పించడం , రెండు, క్యాబినెట్ లో మహిళలెవరూ లేరన్న విమర్శకు జవాబుగా ఒకరిద్దరు మహిళలకు చోటు కల్పించడం.
ముఖ్యమంత్రి మనసులో ఏముందో చెప్పడం కష్టమయినా, టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్న కారణాలు బలమయినవే అనిపిస్తాయి.మహిళలకు సంబంధించి పద్మాదేవేందర్ రెడ్డి పేరు బాగా ప్రచారంలో ఉంది. ఇపుడు డిప్యూటి స్పీకర్ గా ఉన్న పద్మను ప్రమోట్ చేసి క్యాబినెట్ లోకి తీసుకుంటారని, అమెకు హోం శాఖ ఇస్తారని కూడా ప్రచారంలో ఉంది. హోం శాఖనే ఎందుకిస్తారనే దానికి కూడా వారి దగ్గిర జవాబు ఉంది. ప్రస్తుతం హోం మంత్రిగా ఉన్న నాయిని నరసింహారెడ్డికి వయసుకు తగ్గ హోదా ఇచ్చేందుకు ఆయనకు పార్టీలో ఉన్నత పదవి అందించి పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించాలని చెప్పవచ్చని చెబుతున్నారు. ప్రచారంలో ఉన్న వాదన ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా సబితా ఇంద్రారెడ్డిని హోంమంత్రి ని చేశారో, టిఆర్ ఎస్ కూడా పద్మాదేవేందర్ రెడ్డిని అలాగా ప్రమోట్ చేయాలని అనుకుంటున్నారట.
ఈ పదవిలోకి పద్మను తీసుకుంటారనే ఈ ప్రచారం సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతూ ఉంది. డిప్యూటి స్పీకర్ పదవికి కొండాసురేఖను గాని కోవా లక్ష్మి గాని తీసుకుంటారని చెబుతున్నారు. కొండా సురేఖను రెండున్న రేళ్లుగా ఎందుకు వెనకబడ్డారో అర్థం కాదు. ఎందుకంటే, అమె పార్టీలో చేరిన రోజూ, తెలంగాణాలో టిఆర్ ఎస్ ప్రభుత్వం రాగానే సురేఖ మంత్రి అవుతారని చేనేత శాఖను నిర్వహిస్తారని కెసిఆర్ స్వయంగా చెప్పారు.
అమెతోపాటు వినబడుతున్న పేర్లలో నల్గొండ కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి, త్వరలోనే పార్టీలో చేరతారని భావిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ పేర్లు కూడా వినబడుతున్నాయి.
ఇతర మార్పులకు సంబంధించి వినబడుతున్న పేర్లలో డిప్యూటి సిఎం కడియం శ్రీహరి, మహమూద్ అలీ పేర్లున్నాయి. కౌన్సిల్ ఛెయిర్మన్ స్వామిగౌడ్, మరొక గౌడ్ శాసన సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ పేర్లు కూడ ప్రచారంలో ఉన్నాయి. అయితే, స్వామిగౌడ్ క్యాబినెట్లోకి తీసుకునేందుకు ఆయన మీద గతంలో వచ్చిన ఫిర్యాదులు అడ్డు రావచ్చని,ఇది శ్రీనివాస్ గౌడ్ కు అనకూలించవచ్చని వారి అంచనా.