సారాంశం

సిద్దిపేట నూతన రైల్వే స్టేషన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

సిద్దిపేట నూతన రైల్వే స్టేషన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ పర్యటన సందర్భంగా.. సిద్దిపేట-సికింద్రాబాద్‌ మధ్య మొట్టమొదటి ప్యాసింజర్‌ రైలును వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే సిద్దపేట రైల్వే స్టేషన్‌లో కూడా రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే సిద్దిపేట-సికింద్రాబాద్‌ల మధ్య రైలు ప్రారంభోత్సవం నేపథ్యంలో.. బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సిద్దిపేట రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. 

అయితే ఈ ప్రాజెక్టు క్రెడిట్ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పాటు ఫ్లకార్డులు ప్రదర్శించాయి. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు  కుర్చీలు విసురుకోవడంతో.. పలువురికి గాయాలు  అయ్యాయి. దీంతో సిద్దిపేట రైల్వే స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంది. 

ఇక, సిద్దిపేట-సికింద్రాబాద్‌ రైలు ప్రారంభోత్సవ ఫ్లెక్సీలో సీఎం కేసీఆర్,  ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటోలు వేయలేదని.. రైల్వే అధికారులపై బీర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే అధికారుల‌కు, కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు నినాదాలు చేశారు. రైల్వే లైన్ ఏర్పాటు, భూసేకరణ, స్టేషన్ల‌ నిర్మాణం కోసం 60 శాతం నిధులు(సుమారు రూ. 1200 కోట్లు) కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోన ఎందుకు ప్రారంభోత్సవ ఫ్లెక్సీలో వేయలేదని వారు ప్రశ్నిస్తున్నారు.