తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఓ బ్రోకర్..: రేవంత్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీల నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
జడ్చర్ల : తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ బ్రోకర్, పక్కా బ్లాక్ మెయిలర్ అంటూ మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విరుచుకుపడ్డారు. మహబూబ్ నగర్ బిడ్డనని చెప్పుకుంటూ తమ జిల్లా విలువను రేవంత్ తగ్గిస్తున్నాడని అన్నారు. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నదే రేవంత్ రెడ్డి అంటూ లక్ష్మారెడ్డి మండిపడ్డారు.
మహబూబానగర్ జిల్లా జడ్చర్లలో ఏర్పాటుచేసిన 100 పడకల హాస్పిటల్ ను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, జిల్లా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కాంగ్రెస్, బిజెపిలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ది చెందుతోందని... ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన చూసి ఓర్వలేక కొందరు మూర్ఖులు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని అన్నారు.
కేసీఆర్ పాలనలో జడ్చర్ల ఎంతో అభివృద్ది చెంది అద్దంలా మెరిసిపోతోందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఇక్కడి ప్రజలకు మరింత మెరుగైన వైద్యసదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం 100 పడకల హాస్పిటల్ ను ఏర్పాటు చేసిందన్నారు. అన్నిరకాల వైద్య సదుపాయాలు ఈ హాస్పిటల్లో కల్పించనున్నట్లు... చివరకు డయాలసిస్ సెంటర్ కూడా ఈ హాస్పిటల్లో అందుబాటులో వుంటుందని లక్ష్మారెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు బిజెపిపై కూడా లక్ష్మారెడ్డి ఫైర్ అయ్యారు. మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్న బిజెపి నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ప్రజలు బిజెపిని ప్రజలు తిరస్కరించడం ఖాయమని అన్నారు. తెలంగాణ తిరిగి అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ పార్టీయేనని... కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.