మేం అనుకుని వుంటే.. సగం కాంగ్రెస్ వాళ్లు జైళ్లలోనే : హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో వున్న సమయంలో తాము కేసులు పెట్టి వుంటే సగం మంది కాంగ్రెస్ వాళ్లు జైళ్లలో వుండేవారని వ్యాఖ్యానించారు.
![brs mla harish rao sensational comments on congress ksp brs mla harish rao sensational comments on congress ksp](https://static-ai.asianetnews.com/images/01hffgp4mhvzeb2qvcwvz5tps2/harishraooffice-1725190203382566980-03-jpg_363x203xt.jpg)
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మెదక్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. బీఆర్ఎస్ అధికారంలో వున్న సమయంలో తాము కేసులు పెట్టి వుంటే సగం మంది కాంగ్రెస్ వాళ్లు జైళ్లలో వుండేవారని వ్యాఖ్యానించారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతుంటే అసహనంతో ప్రతిపక్షాలపై దాడులు చేయడం సరికాదని హరీష్ రావు హితవు పలికారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 6 చోట్ల బీఆర్ఎస్ గెలిచిందని, స్వల్ప ఓట్ల తేడాతోనే పద్మా దేవేందర్ రెడ్డి ఓడిపోయారని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ లేదని తెలిసినా కాంగ్రెస్ ప్రజలకు ఆశపెట్టి మోసం చేసిందని హరీశ్ దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీకి పాలించడం చేతగాక ప్రతిపక్షాలను వేధిస్తోందని , కర్ణాటకలో 5 గ్యారంటీలో అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటినా హామీలను అమలు చేయలేదని ఆయన ఎద్దేవా చేశారు. 6 నెలల్లో స్థానిక ఎన్నికలు వస్తాయని.. ప్రజలు తిరిగి బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తారని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చెప్పినట్లుగా ఉచిత కరెంట్ సరఫరా కావడం లేదని.. మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మోటార్లను రిపేర్ చేసే వ్యాపారం పెరిగిందని హరీశ్ రావు సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డికి సీఎం పదవి అనేది కేసీఆర్ పెట్టిన భిక్ష అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ పార్టీ హామీలను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తాము మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా అమలు చేశామని, ఇంటింటికి మంచినీళ్లు, కళ్యాణ లక్ష్మీ, రైతుబంధు హామీలను ఎన్నికల్లో ఇవ్వకపోయినా అమలు చేశామని హరీవ్ రావు తెలిపారు. కరోనా సమయంలో ప్రభుత్వం వద్ద నిధులు లేకున్నా రైతుబంధు ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఏ సమస్యా లేకున్నా హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.