MLC Kavitha: "అందుకే.. బాండ్ పేపర్ల పేరిట కాంగ్రెస్ కొత్త డ్రామా"
Assembly Elections:తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ విశ్వాసం కోల్పోయిందనీ, తమను నమ్మడం కోసం బాండ్ పేపర్ల పేరిట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారని ఎమ్మెల్సీ కవిత (MLC K Kavitha) విమర్శించారు.
![BRS leader, MLC K Kavitha cautioned voters to be wary of the bond-paper promises of Congress KRJ BRS leader, MLC K Kavitha cautioned voters to be wary of the bond-paper promises of Congress KRJ](https://static-ai.asianetnews.com/images/01g29bjx704sxeg13gw18xpr6e/kalvakuntla-kavitha-jpg_363x203xt.jpg)
Assembly Elections: బాండ్ పేపర్ల పేరిట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారని కల్వకుంట్ల కవిత (MLC Kavitha) విమర్శించారు. నిజామబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీస్లో ఆమె ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. 137 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఇంత స్థాయికి పడిపోయిందని, తాను ఊహించలేదని ఏద్దేవా చేశారు. జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, దామోదర రాజనరసింహా, భట్టి విక్రమార్క వంటి బడా నేతలు కూడా బాండ్ పేపర్ రాసివ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే.. తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ మేర విశ్వాసం ఉందో ? అర్థం చేసుకోవాలని అన్నారు.
ఇటీవల కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బాండ్ పేపర్ల పేరిట డ్రామా చేసిందనీ, నేడు తెలంగాణలో కూడా ఇదే డ్రామాకు తెర తీశారని మండిపడ్డారు. 223 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు హామీలను అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాశారన్నారు. కానీ అందులో రాసి ఇచ్చిన ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేకపోయారని కవిత మండిపడ్డారు. కర్నాటకలో మహిళలకు రూ.2 వేల పెన్షన్, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ వంటి హామీలను ఇంకా మొదలుపెట్టలేదని విమర్శించారు. యువతను తమ వైపు తిప్పుకునేలా యువనిధి కింద డబ్బులు ఇస్తామని, ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా పంపిణీ చేయడం లేదని తెలిపారు.
బియ్యం పథకానికి బియ్యం లేదని చెప్పి అది కూడా పంపిణీ చేయడం లేదనీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని చెప్పి బస్సుల సంఖ్యను భారీగా తగ్గించారని విమర్శించారు. కర్నాటక సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్తో పాటు సీనియర్ నాయకులంతా ఇదే రకమైన డ్రామా చేశారని విమర్శించారు.సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ గణాంకాల ప్రకారం.. నిరుద్యోగంలో బీజేపీ పాలన హర్యానా తొలి స్థానంలో ఉందనీ, కాంగ్రెస్ రాజస్థాన్ రెండో స్థానంలో ఉందని కవిత తెలిపారు.