BRS leader Harish Rao: కర్ణాటకలో ఐదు హామీల అమలుపై వాస్తవాలు చెప్పకుండా రాహుల్ గాంధీ ఆరు హామీలపై తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హ‌రీశ్ రావు అన్నారు.  

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేప‌థ్యంలో కాంగ్రెస్‌ పార్టీ శుక్ర‌వారం త‌న మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల హామీలను విడుద‌ల చేశారు. మొత్తం 42 పేజీలతో అభయ హస్తం పేరుతో మేనిఫెస్టోను కాంగ్రెస్ ప్ర‌క‌టించింది. అయితే, కాంగ్రెస్ మేనిఫెస్టోను 420 మేనిఫెస్టో అని ఆర్థిక మంత్రి, భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అగ్ర‌నాయ‌కుడు హరీశ్ రావు కొట్టిపారేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

"కాంగ్రెస్ సాధ్యం కాని వాగ్దానాలు చేస్తోంది. అది విశ్వాసం కలిగించదు.. దానికి ప్రజల నుండి మద్దతు లేదు. ఆరు నెలల క్రితం కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన తరువాత కర్ణాటక ప్రజలు పడుతున్న ఇబ్బందులను మేము ఇప్పటికే చూస్తున్నాము" అని మంత్రి హ‌రీశ్ అన్నారు. ఓటర్ల నుంచి ఎదురుదెబ్బ తగులుతుందనే భయంతో మేనిఫెస్టోలో 24 గంటల విద్యుత్ హామీని పొందుపరిచింద‌నీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న రైతు బంధు, కళ్యాణలక్ష్మి, గొర్రెల పంపిణీ వంటి పథకాలను అందులో పొందుపరిచార‌ని విమ‌ర్శించారు.

అలాగే, కర్ణాటకలో ఐదు హామీల అమలుపై వాస్తవాలు వివరించకుండా రాహుల్‌ గాంధీ ఆరు హామీలపై తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. కర్ణాటక ముఖ్యమంత్రి కె. సిద్ధరామయ్య ఖాళీ ఖజానాలే కారణమని పేర్కొంటున్నందున ఐదు హామీలు పూర్తిగా లేదా పాక్షికంగా లబ్ధిదారులకు చేరడం లేదని ఆయన పేర్కొన్నారు. వార్తాపత్రికల క్లిప్పింగ్‌ల సహాయంతో కర్ణాటకలో చేసిన వాగ్దానాలను అమలు చేస్తామనే కాంగ్రెస్ వాదనలను బహిర్గతం చేసిన హ‌రీశ్ రావు.. గాంధీ అక్కడ హామీల అమలుకు టైమ్‌లైన్‌లను నిర్ణయించారని, కానీ ఇప్పుడు దానిని అనుసరించడం లేదని అన్నారు. ప్రయోజనాలు పొందేందుకు అనేక ఆంక్షలు విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల తీర్పును అవమానిస్తోంది. అక్కడి ప్రభుత్వం విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని విమ‌ర్శించారు.

రైతుల సమస్యపై, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కర్ణాటకలో 357 మంది రైతులు కష్టాల కారణంగా ప్రాణాలు కోల్పోయారని, ఇక్కడ కర్ణాటక పరిస్థితి పునరావృతం కావాలా అని తెలంగాణ ప్రజలను అడిగారు. రాష్ట్ర ఏర్పాటుపై మాజీ కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం తన వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజలను బాధించారని పేర్కొన్న హరీష్ రావు.. ఆయ‌న వెంట‌నే ప్ర‌జ‌ల‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.