విఫల విధానాలకు బాధ్యత వహిస్తూ బ్రిటన్ పీఎం రాజీనామా.. మరి మీరెప్పుడు..? : ప్రధాని మోడీపై కేటీఆర్ విమర్శలు
Hyderabad: విఫలమైన ఆర్థిక విధానానికి బాధ్యత వహిస్తూ బాధ్యతలు స్వీకరించిన 45 రోజుల్లోనే బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేయడాన్ని ఉటంకిస్తూ, మీ పదవీకాలం ఎప్పుడు ముగిస్తారని ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణ మంత్రి కేటీ.రామారావు (కేటీఆర్) ప్రశ్నించారు.
TRS working president KTR: ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారుపై మరోసారి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీ.రామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మోడీ పాలనలో దేశంలో నిరుద్యోగం, రూపాయి పతనం, అధిక ధరలు కొత్త రికార్డుల మోత మోగిస్తున్నాయని విమర్శించారు. విఫల ఆర్థిక విధానాలకు బాధ్యత వహిస్తూ.. బ్రిటన్ ప్రధాన మంత్రి కేవలం 45 రోజుల్లోనే పదవికి రాజీనామా చేశారు.. మరీ మీరెప్పుడు బాధ్యత వహిస్తారంటూ ప్రధాని మోడీని ప్రశ్నించారు.
వివరాల్లోకెళ్తే.. విఫలమైన ఆర్థిక విధానానికి బాధ్యత వహిస్తూ బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేయడాన్ని ఉదాహరణగా తీసుకునీ.. పెరుగుతున్న నిరుద్యోగం, క్షీణిస్తున్న రూపాయి విలువ సహా పలు అంశాలను ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోడీపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితులను ప్రస్తావిస్తూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
తన ట్వీట్ లో "బ్రిటన్ ప్రధానమంత్రి లిజ్ ట్రస్ తన ఆర్థిక విధానం విఫలమైనందుకు 45 రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే రాజీనామా చేశారని చదవడానికి సరదాగా ఉంది!
భారతదేశంలో మాకు ఒక ప్రధాని ఉన్నారు.. ఆయన ఈ కిందివి అందించారు..
❇️ 30 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగం
❇️ 45 ఏళ్లలో అత్యధిక ద్రవ్యోల్బణం
❇️ ప్రపంచంలోనే అత్యధిక ఎల్ పీజీ ధరలు
❇️ అత్యల్ప రూపాయి వర్సెస్ యూఎస్ డాలర్
అంటూ" ట్వీట్ లో కేటీఆర్ పేర్కొన్నారు.
అంతకుముందు రోజు కూడా కేటీఆర్ బీజేపీ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ధనమదంతో మునగోడులో గెలవాలని చూస్తోందని ఆరోపించారు. బీజేపీ వ్యవస్థల్ని ఎలా దుర్వినియోగతం చేస్తోందో స్పష్టం కనిస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో గెలవలేక వ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఎన్నిక అని కేటీఆర్ అన్నారు. మునుగోడు ప్రజలు ఉపఎన్నికలో బీజేపీకి గట్టిబుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. నడ్డా అనే అడ్డమైన వాడు 300 పడకల ఆసుపత్రి కట్టిస్తానని ఆరేళ్ల కిందట హామీ ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. ఆ హామీ ఏమైందని మంత్రి ప్రశ్నించారు. మోడీ, ఇంకో బోడీ ఇక్కడికి వచ్చి పీకేదేమీ లేదని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు మూతిమీద తన్నినట్లు సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలన్నీ మోడీ చేతిలో కీలుబొమ్మల్లా మారాయని కేటీఆర్ ఆరోపించారు.