బోధన్ పాస్పోర్ట్ స్కాం : నిమిషంలో రిజైన్ చేస్తా.. ఎంపీ అర్వింద్కి ఎమ్మెల్యే షకీల్ సవాల్
బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర నిఘా వ్యవస్థ విఫలమైందని.. అందుకే దేశంలోకి ఇతర దేశాల వారు వస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎంపీ అరవింద్కి పిచ్చి కుక్క కరిచిందని షకీల్ ధ్వజమెత్తారు.
బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర నిఘా వ్యవస్థ విఫలమైందని.. అందుకే దేశంలోకి ఇతర దేశాల వారు వస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎంపీ అరవింద్కి పిచ్చి కుక్క కరిచిందని షకీల్ ధ్వజమెత్తారు. బోధన్లో రోహింగ్యాలు ఉన్నారని నిరూపిస్తే నిమిషంలో తన పదవికి రాజీనామా చేస్తానని షకీల్ సవాల్ విసిరారు.
32 మంది నకిలీ పాస్పోర్ట్లు పొందారని.. రీజినల్ పాస్పోర్ట్ అధికారిని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమంగా మనదేశంలోకి చొరబడిన విదేశీయులు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని షకీల్ ఆరోపించారు.
గతంలో విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా వున్న జైశంకర్ ఇప్పుడు మంత్రిగా వున్నారని ఆయనకు పాస్పోర్ట్లు ఎలా తయారు చేయాలో తెలియదా అని ఆయన ప్రశ్నించారు.
అంతకుముందు బోధన్ పాస్పోర్ట్ స్కాంలో మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ మంగళవారం మీడియాకు వివరించారు. వీరితో కలిపి ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మంది అరెస్ట్ అయినట్లు సజ్జనార్ తెలిపారు.
Also Read:బోధన్ స్కాం: ఒకే ఇంటి అడ్రస్, 32 మందికి పాస్పోర్ట్.. నిందితుల్లో పోలీసులు
ఒకే ఇంటి అడ్రస్పై 32 పాస్పోర్ట్లు వున్నాయని.. పరారీలో వున్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో నలుగురు బంగ్లాదేశీయులు వున్నారని ఆయన చెప్పారు. వీరంతా నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలతో పాస్పోర్ట్ తీసుకున్నారని సీపీ పేర్కొన్నారు.
అలాగే ఇప్పటి వరకు ఎంతమంది దేశం దాటి వెళ్లారనేదానిపై విచారిస్తున్నామన్నారు. మొత్తం నకిలీ పత్రాల ద్వారా 72 పాస్పోర్టులు పొందారని సజ్జనార్ పేర్కొన్నారు.
బోధన్ నుంచి దుబాయ్కి వెళ్తుండగా నిందితులు పట్టుబడ్డారని.. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు పోలీస్ అధికారులు వున్నారని ఆయన చెప్పారు. ప్రధాన నిందితుడు నీతై దాస్ అలియాస్ సంజీబ్ దుట్టాగా గుర్తించామని.. వీరిందరికీ అతనే పాస్పోర్టులు ఇప్పించినట్లు సీపీ వెల్లడించారు