బోధన్ స్కాం: ఒకే ఇంటి అడ్రస్, 32 మందికి పాస్పోర్ట్.. నిందితుల్లో పోలీసులు
బోధన్ పాస్పోర్ట్ స్కాంలో మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ మంగళవారం మీడియాకు వివరించారు.
బోధన్ పాస్పోర్ట్ స్కాంలో మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ మంగళవారం మీడియాకు వివరించారు.
వీరితో కలిపి ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మంది అరెస్ట్ అయినట్లు సజ్జనార్ తెలిపారు. ఒకే ఇంటి అడ్రస్పై 32 పాస్పోర్ట్లు వున్నాయని.. పరారీలో వున్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు సీపీ వెల్లడించారు.
అరెస్ట్ అయిన వారిలో నలుగురు బంగ్లాదేశీయులు వున్నారని ఆయన చెప్పారు. వీరంతా నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలతో పాస్పోర్ట్ తీసుకున్నారని సీపీ పేర్కొన్నారు. అలాగే ఇప్పటి వరకు ఎంతమంది దేశం దాటి వెళ్లారనేదానిపై విచారిస్తున్నామన్నారు.
మొత్తం నకిలీ పత్రాల ద్వారా 72 పాస్పోర్టులు పొందారని సజ్జనార్ పేర్కొన్నారు. బోధన్ నుంచి దుబాయ్కి వెళ్తుండగా నిందితులు పట్టుబడ్డారని.. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు పోలీస్ అధికారులు వున్నారని ఆయన చెప్పారు.
ప్రధాన నిందితుడు నీతై దాస్ అలియాస్ సంజీబ్ దుట్టాగా గుర్తించామని.. వీరిందరికీ అతనే పాస్పోర్టులు ఇప్పించినట్లు సీపీ వెల్లడించారు. ఈ కుంభకోణంలో ప్రమేయమున్న ఎస్సై మల్లేశ్ రావు, ఏఎస్స అనిల్ కుమార్ను అదుపులోకి తీసుకున్నామని సజ్జనార్ చెప్పారు.
బోధన్లో 7 అడ్రస్ల పేరుతో 72 పాస్పోర్ట్లు పొందారని.. ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండా క్లియరెన్స్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ఒక్కో పాస్పోర్ట్కు రూ.10 వేల నుంచి 30 వేలు తీసుకున్నాడని సీపీ వెల్లడించారు.
బెంగాల్ ఆధార్ కార్డుల అడ్రస్ మార్చి బోధన్ ఆధార్ కార్డులు పెట్టారని.. బెంగాల్ నుంచి 60 ఆధార్ కార్డులు తీసుకున్నట్లు గుర్తించామని సజ్జనార్ పేర్కొన్నారు. వీసా, పాస్పోర్టులు పొందడమే కాకుండా 19 మంది దేశం వదిలి వెళ్లారని.. మిగిలిన వారు ఎక్కడున్నారనే దానిపై లోతుగా విచారిస్తున్నామని సీపీ చెప్పారు. 72 మంది ఆధార్, పాస్పోర్టుల రద్దుకు కేంద్రానికి లేఖ రాశామని సజ్జనార్ వెల్లడించారు.