తొమ్మిది మంది వుండి ఉపయోగమేంటీ : బీజేపీ అధికార ప్రతినిధులపై బండి సంజయ్ ఆగ్రహం
తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధులపై రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు . తొమ్మిది వున్నా ఉపయోగం లేదని.. ఇకపై ప్రతి రోజు అధికార ప్రతినిధుల్లో ఒకరు పార్టీ కార్యాలయంలో ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ . పార్టీలో ఇక్కడ 9 మంది అధికార ప్రతినిధులున్నా... పార్టీకి ఆశించిన మేర పనిచేయడం లేదని ఫైరయ్యారు. అధికార ప్రతినిధులుగా చేయాల్సిన పనులను వారు చేయడం లేదని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలని చెబుతున్నా.. ఆ మేరకు అధికార ప్రతినిధుల నుంచి స్పందన లేదన్నారు. ఇకపై అలా కుదరదని చెప్పిన బండి సంజయ్.. ఇకపై ప్రతి రోజు అధికార ప్రతినిధుల్లో ఒకరు పార్టీ కార్యాలయంలో ఉండాల్సిందేనని బండి సంజయ్ ఆదేశించారు. జిల్లాల్లో జరిగే ఘటనలపై నేతలను అప్రమత్తం చేస్తూ పార్టీ లైనప్ను వారికి వివరించాలని ఆయన అధికార ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
అంతకుముందు బుధవారం కరీంనగర్లో (karimnagar) జరిగిన హిందూ ఏక్తా యాత్రలో (hindu ekta yatra) బండి సంజయ్ (bandi sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మసీదులు తవ్వి చూద్దామంటూ ఎంఐఎం (aimim) అధినేత అసదుద్దీన్ ఒవైసీకి (asaduddin owaisi) సవాల్ విసిరారు. శవం వస్తే మీది.. శివ లింగం వస్తే మాది అంటూ వ్యాఖ్యానించారు. లవ్ జిహాదీ మత మార్పిడులను చూస్తూ ఊరుకోమన్న బండి సంజయ్ .. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉర్దూను నిషేధిస్తామని సంచలన ప్రకటన చేశారు. అలాగే తెలంగాణలో మదర్సాలను శాశ్వతంగా తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. మదర్సాలను ఉగ్రవాద శిక్షణా కేంద్రాలుగా మార్చారని బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్లో తనను మూడు సార్లు చంపాలని చూశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ఫైల్స్లా తెలుగు రాష్ట్రాల్లో రజాకార్ ఫైల్స్ చూపిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read: మసీదులు తవ్వి చూద్దామా.. శవం వస్తే మీది, శివమ్ వస్తే మాది : ఒవైసీకి బండి సంజయ్ సవాల్
అదే రోజు ఉదయం బండి సంజయ్ మాట్లాడుతూ.. దేశంలోని హిందువుల పట్ల వివిధ రాజకీయ పార్టీల వైఖరిని తమ పార్టీ మార్చిందని అన్నారు. హిందువుల గురించి మాట్లాడమని రాజకీయ పార్టీలను కూడా బీజేపీ బలవంతం చేసిందని, మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు ఈ రాజకీయ పార్టీలు ఎప్పుడూ హిందువులను విభజించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. హిందువుల ఐక్యతను చాటిచెప్పేందుకే తాము బుధవారం కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్రను నిర్వహిస్తున్నామని, ఈ యాత్రలో వేలాది మంది హిందువులు పాల్గొంటారని తెలిపారు. హనుమాన్ జయంతి నాడు తాము ఏటా హిందూ ఏక్తా యాత్రను నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో హిందువులందరూ ఐక్యంగా ఉన్నారని తెలియజేసేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని ఆయన అన్నారు. యాత్రకు అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.