మసీదులు తవ్వి చూద్దామా.. శవం వస్తే మీది, శివమ్ వస్తే మాది : ఒవైసీకి బండి సంజయ్ సవాల్
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ విసిరారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మసీదులను తవ్విచూద్దామని.. అందులో శవం వస్తే మీదని, శివమ్ వస్తే మాదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరీంనగర్లో (karimnagar) జరిగిన హిందూ ఏక్తా యాత్రలో (hindu ekta yatra) తెలంగాణ బీజేపీ (bjp) అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మసీదులు తవ్వి చూద్దామంటూ ఎంఐఎం (aimim) అధినేత అసదుద్దీన్ ఒవైసీకి (asaduddin owaisi) సవాల్ విసిరారు. శవం వస్తే మీది.. శివ లింగం వస్తే మాది అంటూ వ్యాఖ్యానించారు. లవ్ జిహాదీ మత మార్పిడులను చూస్తూ ఊరుకోమన్న బండి సంజయ్ .. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉర్దూను నిషేధిస్తామని సంచలన ప్రకటన చేశారు. అలాగే తెలంగాణలో మదర్సాలను శాశ్వతంగా తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. మదర్సాలను ఉగ్రవాద శిక్షణా కేంద్రాలుగా మార్చారని బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్లో తనను మూడు సార్లు చంపాలని చూశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ఫైల్స్లా తెలుగు రాష్ట్రాల్లో రజాకార్ ఫైల్స్ చూపిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
అంతకుముందు ఉదయం బండి సంజయ్ మాట్లాడుతూ.. దేశంలోని హిందువుల పట్ల వివిధ రాజకీయ పార్టీల వైఖరిని తమ పార్టీ మార్చిందని అన్నారు. హిందువుల గురించి మాట్లాడమని రాజకీయ పార్టీలను కూడా బీజేపీ బలవంతం చేసిందని, మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు ఈ రాజకీయ పార్టీలు ఎప్పుడూ హిందువులను విభజించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. హిందువుల ఐక్యతను చాటిచెప్పేందుకే తాము బుధవారం కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్రను నిర్వహిస్తున్నామని, ఈ యాత్రలో వేలాది మంది హిందువులు పాల్గొంటారని తెలిపారు. హనుమాన్ జయంతి నాడు తాము ఏటా హిందూ ఏక్తా యాత్రను నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో హిందువులందరూ ఐక్యంగా ఉన్నారని తెలియజేసేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని ఆయన అన్నారు. యాత్రకు అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
ALso Read:Bandi Sanjay: హిందువుల పట్ల రాజకీయ పార్టీల వైఖరిని మార్చింది బీజేపీనే.. : బండి సంజయ్
హిందూ సమాజాన్ని చీల్చేందుకు, హిందూ దేవుళ్లను అవమానించేలా ఎవరైనా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఆలయ నిర్మాణానికి ఎంతో మంది కరసేవకులు ప్రాణత్యాగం చేశారని, కరసేవకుల త్యాగాలకు విలువ ఇచ్చేలా ప్రధాని నరేంద్ర మోడీ ఆలయాన్ని నిర్మిస్తున్నారని అన్నారు. తనను ఎంపీగా చేసిన కరీంనగర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
కరీంనగర్ ప్రజల సేవలో మూడేళ్లు పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉందని, ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో తనపై ప్రేమను కురిపించి ఎంపీగా చేసినందుకు సీటు ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో పనులు చేశానని, నియోజకవర్గంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు తీసుకొచ్చానని తెలిపారు. శాతవాహన యూనివర్శిటీకి, సైనిక్ స్కూల్కు 12-బి స్టేటస్ తీసుకొచ్చింది తానేనని అన్నారు. తన రెండేళ్ల పదవీకాలంలో కరీంనగర్ ప్రజల హృదయాలను గెలుచుకుంటానని చెప్పారు.