గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై  బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ ను ఎత్తివేసింది.  


హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ ను ఆదివారంనాడు ఎత్తివేసింది. మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారని రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటేసింది బీజేపీ నాయకత్వం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

2022 ఆగస్టు 23న రాజాసింగ్ పై బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ వేటేసింది. రాజాసింగ్ పై సస్పన్షన్ ను ఎత్తివేయాలని బీజేపీకి చెందిన తెలంగాణ రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకత్వాన్ని కోరారు.ఈ విషయమై రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వంతో చర్చలు జరిపింది. బీజేపీ నేత విజయశాంతి రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని సోషల్ మీడియా వేదికగా కూడ కోరారు. ఈ దఫా తనకు బీజేపీ టిక్కెట్టు కేటాయించకపోతే తాను పోటీకి దూరంగా ఉంటానని కూడ రాజాసింగ్ ప్రకటించారు.

బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.తొలి జాబితాలో రాజాసింగ్ కు చోటు దక్కే అవకాశం ఉందనే ప్రచారం ఆ పార్టీవర్గాల్లో ఉంది. దీంతో రాజాసింగ్ పై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా బీజేపీ క్రమశిక్షణ సంఘం ఇవాళ తెలిపింది. గత ఏడాది అక్టోబర్ 10వ తేదీన బీజేపీ నాయకత్వం పంపిన షోకాజ్ నోటీసుకు రాజా సింగ్ సమాధానం పంపారు. ఈ సమాధానంపై సంతృప్తి చెందినట్టుగా బీజేపీ క్రమశిక్షణ సంఘం మెంబర్ సెక్రటరీ ఓం పాఠక్ ఓ ప్రకటనలో తెలిపారు.

also read:పార్టీ నిబంధనలు ఉల్లంఘించలేదు: బీజేపీ షోకాజ్ కు రాజాసింగ్ సమాధానం

గత ఏడాది ఆగస్టు మాసంలో హైద్రాబాద్ లో మునావర్ ఫరూఖీ షోకి అనుమతి ఇవ్వవద్దని రాజాసింగ్ అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ మునావర్ ఫరూఖీ షోకి అనుమతిస్తే ఆ షోని అడ్డుకుంటామని కూడ ఆయన వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ షోకి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. భారీ బందోబస్తు మధ్య షో జరిగింది. అయితే ఈ షో జరిగిన తర్వాత రాజాసింగ్ సోషల్ మీడియాలో ఓ వీడియో ను అప్ లోడ్ చేశారు.ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం ఆందోళనలు నిర్వహించింది. ఈ విషయమై రాజాసింగ్ పై కేసు నమోదైంది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్ పై బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ వేటేసింది.

మరోవైపు రాజాసింగ్ పై తెలంగాణ సర్కార్ పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకు పంపింది. జైలు నుండి రాజాసింగ్ విడుదలయ్యారు. ఏడాది తర్వాత రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ ను బీజేపీ ఎత్తివేసింది.