హలో లక్ష్మణా... ఇదేమి పోరాటం?
టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడదామంటారు బిజెపి లక్ష్మ ణ్. పైన, కెసిఆర్ ప్రధాని మోదీకి జిగ్రి దోస్తయినపుడు పోరాటమెలా సాగుతుంది?
ఆంధ్రలో లాగే తెలంగాణలో కూడా రాష్ట్ర బిజెపి నాయకులది చాలా దయనీయమయిన పరిస్థితి. తెలంగాణాలో బడుగు జాతులెక్కువ అని బిసి నాయకుడు లక్ష్మణ్ ని ఆ పార్టీ తెలంగాణా కమిటీ అధ్యక్షుడిని చేసింది. మరొక బిసినాయకుడు బండారు దత్తాత్రేయ ను కేంద్రమంత్రిని చేసి, ఇండిపెండెంట్ హోదా ఇచ్చి గౌరవించింది.
అయితే, తాను అజాత శత్రువునని, అన్ని పార్టీలలో తనకు మిత్రులు,అభినమానులు,ఓటర్లున్నారని నిరూపించుకునేందుకు తాపత్రయ పడతూ ఉంటారు దత్తాత్రేయ. కొట్లాడితే వచ్చేదేమీ లేదని ఆయన విశ్వాసం. బిజెపి నాయకుడి గా కంటే, వ్యక్తిగా ఓటర్లకు సన్నిహితంగా మెలగడానికే ఆయన ఎక్కువ ప్రాముఖ్యమిస్తారు. ప్రజలు కూడా ఆయన రామ్నగర్ దత్తన్నఅనే చూస్తారు తప్ప ‘సంఘి’ గా చూడరు.
ఆయన పాలసీ విజయవంతమయిందనే చెప్పాలి. అందుకే ప్రతిఏడాది కుల,మతం,ప్రాంతం,పార్టీ అనే విబేధం లేకుండా అందరిని పిల్చి ‘అలయ్ బలయ్’ చేసి అలరిస్తారు. గవర్నర్ దగ్గిర నుంచి కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు దాకా ఆయన్ని ప్రశంసిస్తారు.
మొన్నీమధ్య జరిగిన అలయ్ బలయ్ లో ఆయన ఆంధ్ర రాష్ట్రానికి కూడా వెళ్లి అలయ్ బలయ్ జరపాలని కొందరు చెబితే, అన్ని ప్రాంతాలలో అలయ్ బలయ్ ఆర్గనైజ్ చేసిన తెలుగునాయకుడు అని పేరుపొందాలని సలహా ఇచ్చారు.
ఇక మరొక బిసి నాయకుడు,పార్టీ రాష్ట్ర కమిటి అధ్యక్షుడు, డాక్టర్ లక్ష్మణ్ సంగతి చూడండి. ఆయన రెండురోజుల కొకసారి కెసిఆర్ మీద పోరాటం చేయాలని అపోజిషన్ రోల్ తీసుకుంటున్నారు. యాత్రలు కూడా చేస్తున్నారు. పోరాటం నినాదం మాత్రం గొంతెత్తి బిగ్గరగా అరుస్తున్నారు. నిన్న కూడా ఆయన ఇలాగే పిలుపు ఇచ్చారు. అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందని గట్టిగా చెప్పారు.
బీజేపీ పదాధికారులు, పార్టీ జిల్లా శాఖల అధ్య క్షులు, ముఖ్యులతో భేటీ అయ్యాక పోరాటోపన్యాం చేస్తూ గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను అమలుచేయడంలో టీఆర్ఎస్ విఫలమైందన్నారు. టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలపై పోరాడటానికి ఇదే సమయ మని అన్నారు.
2019 ఎన్నికలను దృష్టిలో పెట్టు కుని ప్రజా ఉద్యమాలపై దృష్టిపెట్టాలని పార్టీ శ్రేణులకు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఇంతకీ ముఖ్యమంత్రి కెసిఆర్ మీద బిజెపి పోరాటమంటే ఎవరు నమ్ముతారే లక్ష్మ ణ్ణా. కెసిఆర్ కేంద్ర బిజెపికి, అందునా ప్రధానికి బాగా అయిన వాడు.
కేంద్రంలో బిజెపి మీద కాంగ్రెస్ విసిరే రాళ్ల పడకుండా ఎంపి వినోద్ లోక్ సభలో ఎలా చేయిఅడ్డపెడుతుంటారో చూశావా. నోట్ల రద్దు మీద స్పష్టంగా సమర్థించిన ఎన్డీయేతర ముఖ్యమంత్రులలో కెసిఆరే ముఖ్యుడు.
ఇలాంటి ఆత్మీయుడి మీద లక్ష్మ న్ రోజుకు రెండు సార్లయినా పోరాటం చేయాలని మాట్లాడటం మజాకనిపిస్తుంది. అవునా, కాదా?