కాంగ్రెస్, టీడీపీలకే కాదు, టీఆర్ఎస్కు బీజేపీ ఎసరు
రెండు తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ నాయకత్వం పావులు కదుపుతోంది. తొలుత తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకొనే దిశగా ఆ పార్టీ నాయకత్వం వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది.
హైదరాబాద్: రెండు తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ నాయకత్వం పావులు కదుపుతోంది. తొలుత తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకొనే దిశగా ఆ పార్టీ నాయకత్వం వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్లకు చెందిన నేతలకు కమలదళం గాలం వేస్తోంది.
2023లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఇప్పటి నుండే ప్రయత్నాలను ప్రారంభించింది.పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది.
2018 డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క అసెంబ్లీ స్థానానికి మాత్రమే పరిమితమైంది. కానీ, 4 మాసాల వ్యవధిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 4 ఎంపీ స్థానాలను గెలుచుకొంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలు కూడ బీజేపీకి కలిసివచ్చాయి. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని కమల దళం భావిస్తోంది. బీజేపీ మాజీ అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 6వ తేదీన హైద్రాబాద్లో పర్యటించారు. బీజేపీ నేతలకు దిశానిర్ధేశం చేశారు.
ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలతో బీజేపీ అగ్రనేతలు చర్చలు జరుపుతున్నారు. రానున్న రోజుల్లో ఇతర పార్టీల నుండి కూడ పెద్ద ఎత్తున బీజేపీలో చేరికలు ఉండే అవకాశం ఉంది. త్రిపుర రాష్ట్రంలో కనీసం ఒక్క శాతం ఓటు కూడ బీజేపీకి గతంలో లేదు. కానీ, గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
త్రిపుర రాష్ట్రంలో బీజేపీ ఇంచార్జీగా రామ్ మాధవ్ ఆ సమయంలో పనిచేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రామ్ మాధవ్, మురళీధర్ రావులు పనిచేస్తున్నారు. తెలంగాణలో రెండో దఫా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. నాలుగు ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం వెనుక స్థానికంగా చోటు చేసుకొన్న పరిస్థితులు కూడ కారణంగా టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడ కొందరు పార్టీ నాయకత్వం తీరుపై అసంతృప్తితో ఉన్నారు. బీజేపీలో చేరాలని భావిస్తున్నారు. పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న నేతలతో బీజేపీ నేతలు టచ్లోకి వెళ్లినట్టుగా ప్రచారం సాగుతోంది.
తెలంగాణలో టీఆర్ఎస్ రెండో దఫా అధికారంలోకి వచ్చింది. వరుసగా రెండు దఫాలు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడే అవకాశం లేకపోలేదని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఎన్నికల నాటికి ఇతర పార్టీల నుండి వచ్చే నేతలను కూడ తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ నాయకత్వంప్లాన్ చేస్తోంది.
ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది. వైసీపీకి భారీ మెజారిటీ వచ్చింది. అయితే ఏపీలో టీడీపీని లక్ష్యంగా చేసుకొని బీజేపీ పావులు కదుపుతోంది. టీడీపీకి చెందిన కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకోనుంది. అయితే ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది.
తెలంగాణలో చోటు చేసుకొన్న పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు కాషాయ దళం జాగ్రత్తలు అడుగులు వేస్తోంది. తొలుత తెలంగాణలో టీఆర్ఎస్పైనే బీజేపీ ఎక్కువగా కేంద్రీకరించనుంది. తెలంగాణలో తమ పార్టీ విస్తరించేందుకు అవకాశాలు ఎక్కువగా అనుకూలంగా ఉన్నాయని బీజేపీ నాయకత్వం అభిప్రాయంతో ఉంది.