ఏ పార్టీలో చేరినా నాకు నష్టం లేదు.. నా తండ్రి ఎప్పటికీ కాంగ్రెస్వాదే : డీఎస్ రాజీనామాపై అర్వింద్ స్పందన
కాంగ్రెస్ పార్టీకి డీ శ్రీనివాస్ రాజీనామా చేసిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. పార్టీలో చేరిన 24 గంటల్లోనే రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో డీఎస్ కుమారుడు , నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు.

కాంగ్రెస్ పార్టీకి డీ శ్రీనివాస్ రాజీనామా చేయడంపై స్పందించారు ఆయన కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. నిన్న కాంగ్రెస్లో చేరిక, నేడు రాజీనామాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆరోగ్యం బాగాలేని వ్యక్తిని శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టొద్దని ఆయన హితవు పలికారు. తన తండ్రి ఏ పార్టీలో చేరినా తనకు నష్టం లేదని అర్వింద్ స్పష్టం చేశారు. 2018 నుంచే పార్టీలో చేరుతానని అడిగినా చేర్చుకోలేదని.. 40 ఏళ్లు సేవ చేసిన వ్యక్తికి సోనియా గాంధీ కనీసం ఫోన్ చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ తన తండ్రి ఎప్పటికీ కాంగ్రెస్ వాదేనని అర్వింద్ స్పష్టం చేశారు.
మరోవైపు డీఎస్ రాజీనామాపై ఆయన పెద్ద కుమారుడు సంజయ్ స్పందించారు. తన తండ్రికి ప్రాణ హాని ఉందని సంచలన కామెంట్స్ చేశారు. తన తండ్రికి ఫిట్స్ వస్తే ఇంట్లో ఎందుకు ఉంచారని.. ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. అరవింద్కు కొందరు సహకరిస్తున్నాతరని.. వాళ్లు ఎవరో తెలుసునని అన్నారు. వాళ్లు పద్దతి మార్చుకుంటే మంచిదని చెప్పుకొచ్చారు. అరవింద్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందని ఆరోపించారు.
అరవింద్ దిగజారి వ్యవహరిస్తున్నారన మండిపడ్డారు. రాజీనామా లేఖలు బీజేపీ ఎంపీ చేస్తున్న డర్టీ పాలిటిక్స్ అని విమర్శించారు. పార్టీ ఆదేశిస్తే అరవింద్పై పోటీ చేస్తానని అన్నారు. అరవింద్ తన తండ్రిని బ్లాక్ మెయిల్ చేసి లేఖలు రాయిస్తున్నారని ఆరోపించారు. ఇక, తాను రెండేళ్లుగా కాంగ్రెస్లో చేరడానికి ఎదురు చూశానని చెప్పారు. తాను కాంగ్రెస్లో చేరడానికి సంబంధించి మహేష్ గౌడ్కు సమాచారం ఉందో లేదో తనకు తెలియదని అన్నారు.
ALso REad: మా నాన్నకు ప్రాణహాని ఉంది.. వాళ్లు పద్దతి మార్చుకుంటే మంచిది: డీఎస్ కుమారుడు సంజయ్ సంచలనం
అయితే డీఎస్ ఇద్దరు కొడుకుల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు తారా స్థాయికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. డీఎస్, ఆయన పెద్ద కుమారుడు సంజయ్.. ఆదివారం కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరిణామాలు ప్రస్తుతం బీజేపీలో ఉన్న డీఎస్ చిన్న కుమారుడు అరవింద్కు ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉండటంతో.. కుటుంబంలో నెలకొన్న రాజకీయ ఘర్షణ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరిన మరుసటి రోజే డీఎస్ నుంచి రాజీనామా ప్రకటన వెలువడినట్టుగా తెలుస్తోంది.
అంతేకాదు.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు సోమవారం డీఎస్ రాజీనామా లేఖను పంపారు. డీఎస్ రాజీనామా లేఖను ఆయన భార్య ధర్మపురి విజయలక్ష్మి మీడియాకు విడుదల చేశారు. ఆ వీడియోలో డీఎస్ రాజీనామా లేఖపై సంతకం చేస్తున్నట్టుగా కూడా చూపెట్టారు. కాంగ్రెస్ వాళ్లు, మీడియా వాళ్లు తమ ఇంటికి రావొద్దని డీఎస్కు ఆరోగ్యం సహకరించడం లేదని ఆమె చెప్పారు.