కేసీఆర్ ఎక్కడ కాలు పెడితే అక్కడ వినాశనమే.. కుమారస్వామి, ఉద్థవ్ థాక్రేల ఆడ్రస్ ఏమైంది : రఘునందన్ రావు
కేసీఆర్ ఎక్కడ కాలు పెడితే అక్కడ వినాశనమేనని వ్యాఖ్యానించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. కర్ణాటకలో కుమారస్వామి, మహారాష్ట్ర ఉద్ధవ్ థాక్రేలను కేసీఆర్ కలిసిన తర్వాత వారిద్దరి పదవులు ఊడిపోయాయని రఘునందన్ విమర్శించారు.
కేసీఆర్ ఎక్కడ కాలు పెడితే అక్కడ వినాశనమేనని వ్యాఖ్యానించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఆదివారం మునుగోడులో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కర్ణాటకలో కుమారస్వామిని కేసీఆర్ కలిసిన ఆర్నేళ్లకే ఆయన సీఎం కుర్చీ దిగిపోయారంటూ రఘునందన్ రావు సెటైర్లు వేశారు. మహారాష్ట్ర వెళ్లి ఉద్ధవ్ థాక్రేను కేసీఆర్ కలిశారని.. ఆయన కూడా కుర్చీలో లేడన్నారు. కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనపై ఆయనకే నమ్మకం లేదని.. అందుకే సూది దబ్బలం పార్టీలైన కమ్యూనిస్ట్లతో జతకట్టారని రఘునందన్ రావు విమర్శించారు.
తెలంగాణలో సీపీఐకి ఏమైనా ఓట్లు వున్నాయా అని ఆయన ప్రశ్నించారు. సీపీఐ గుర్తు మీద గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేని కూడా టీఆర్ఎస్ ఎత్తుకుపోయిందని రఘునందన్ ఎద్దేవా చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని సర్పంచ్లు, విలేజ్ సెక్రటరీలు.. ఉపాధి హామీ పథకం పనులు వున్నాయని జనాన్ని పిలిపించారని ఆయన ఆరోపించారు. బీజేపీ గెలిస్తే మోటర్లకు మీటర్లు వస్తాయని కేసీఆర్ చెబుతున్నారని.. కానీ, దీనిపై పార్లమెంట్లో బిల్లు పాసైందా, జీవో ఏమైనా ఇచ్చామా అన్న విషయాన్ని కేసీఆర్ చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.