కాళేశ్వరంపై మరోసారి ఇంజనీరింగ్ నిపుణుల సలహాలు తీసుకోవాలి: ఈటల రాజేందర్
కాళేశ్వరం ప్రాజెక్టు విసయంలో మరోసారి ఇంజనీరింగ్ నిపుణుల అభిప్రాయం తీసుకోని ప్రజలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోరారు.
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మరోసారి ఇంజనీరింగ్ నిపుణుల సలహాలు తీసుకొని ప్రజలకు నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని ఈటల రాజేందర్ కోరారు.
శుక్రవారం నాడు హైద్రాబాద్ లో పార్టీ కార్యాలయంలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిస్కవరీ వంటి చానెల్ వెబ్ సైట్ నుండి అదృశ్యమైందన్నారు. మీ అద్భుతమైన ఇంజనీరింగ్ మేథస్సు పేరుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరిఖనిని, మంథనిని తదితర ప్రాంతాలను ముంచిందని ఈటల రాజేందర్ విమర్శించారు. రాత్రికి రాత్రే బీజేపీ నేతలపై కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు కూడా ఖజానాలో డబ్బులు లేని పరిస్థితి నెలకొందని చెప్పారు. అయినా కూడా కమీషన్ల కోసం కేసీఆర్ సర్కార్ ప్రయత్నాలు చేస్తుందని ఆయన విమర్శలు చేశారు.
కేసీఆర్ ది కుటుంబ పాలన కాకపోతే ఏం పాలన చేస్తున్నారో చెప్పాలని బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రశ్నించారు.రాష్ట్రాల అభివృద్దితోనే దేశాభివృద్ది ముడిపడి ఉందని చెప్పిన మహానీయుడు నరేంద్ర మోడీ అని గుర్తు చేశారు. తమ పార్టీలో చేరుతున్న నేతలపై టీఆర్ఎస్ సర్కార్ వేధింపులకు పాల్పడుతుందన్నారు.పీడీ యాక్టులు పెట్టి జైల్లో వేస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నవారిపై కేసులు పెడుతున్నారన్నారు. టీఆర్ఎస్ లో ఉన్న సమయంలో ఈ అంశాలు గుర్తుకు రాలేదా అని కూడా ప్రశ్నించారు.