తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లేందుకు సిద్దమయ్యారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ఘటనను బీజేపీ అధిష్టానానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి  సంజయ్ నివేదిక పంపారు. ఈ కేసుకు సంబందించి బీజేపీ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డిలన ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. 

తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లేందుకు సిద్దమయ్యారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ఘటనను బీజేపీ అధిష్టానానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నివేదిక పంపారు. ఈ కేసుకు సంబందించి బీజేపీ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డిలన ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇక, బీజేపీ లీగల్ సెల్‌తో బండి సంజయ్ సాయంత్రం సమావేశం కానున్నారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలని బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. 

ఇక, మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర వెనుక బీజేపీ నేతలున్నారనే ఆరోపణలను బండి సంజయ్ ఖండించారు. హైదరాబాద్ లోని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇంటికి బండి సంజయ్ వెళ్లారు. మహబూబ్ నగర్‌లో బీజేపీ నేతల ఇళ్లపై రాళ్ల దాడిపై మాట్లాడారు. కుట్ర వెనుక ఉన్న అన్ని విషయాలను బయటపెడతామన్నారు. తప్పుడు కేసులు, ఆరోపణలతో కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. తప్పుడు ఆరోపణలతో బీజేపీ పోరాటాన్ని ఆపలేరని తెలిపారు. 

ఇక, తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రను భగ్నం చేసినట్టుగా పోలీసులు వెల్లడించడం తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, డీకే అరుణల ప్రమేయం ఆరా తీస్తున్నట్టుగా తెలిపారు. అయితే ఈ పరిణామాలను డీకే అరుణ స్పందించారు. ఈ కేసుల వెనక కేసీఆర్, శ్రీనివాస్ గౌడ్‌ల కుట్ర ఉందని ఆరోపించారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ మీద హత్య కుట్ర అనేది ఒక పచ్చి అబద్దం అని చెప్పారు. తన ఇంటిపై జరిగిన రాళ్ల దాడిపై డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇళ్లపై రాళ్లు వేయడం ఏం రాజకీయం అని ప్రశ్నించారు. దమ్ముంటే ఎదురుగా కొట్లాడాలని సవాలు విసిరారు. రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదని ఆమె అన్నారు. సీబీఐతో పాటు అన్ని దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలని కోరతామని చెప్పారు. కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పుకొచ్చారు. పులిలా ఉండే స్టీఫెన్ రవీంద్ర వంటి అధికారులు పిల్లిలాగా మారుతున్నారని ఆరోపించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవినీతిపై పోరాడుతోన్న వారికి కచ్చితంగా షల్టర్ ఇస్తామని స్పష్టం చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర వెనుక...‌ ప్రశాంత్ కిషోర్ కుట్ర ఉందని ఆరోపించారు. 

ఎన్నికల్లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారని కొందరు వ్యక్తులు ఈసీకి ఫిర్యాదు చేశారని.. దీన్ని ఆయన తట్టుకోలేకపోయారని అన్నారు. కబ్జాలు, అవినీతిపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న యువకులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కక్ష పెంచుకున్నారని తెలిపారు. ఇది ఒక రాజకీయ కుట్ర అని ఆరోపించారు. మంత్రి సానుభూతి కోసమే హత్యకు కుట్ర అని డ్రామా చేస్తున్నారని విమర్శించారు.