బీజేపీ నేతల కీలక సమావేశం: ఈటల చేరిక, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ
మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరికతో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై బీజేపీ నేతలు సమాలోచనలు చేస్తున్నారు.
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరికతో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై బీజేపీ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. శుక్రవారం నాడు హైద్రాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్ కూడ హాజరయ్యారు. ఈ నెల 14వ తేదీన బీజేపీలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరనున్నారు. ఈటల రాజేందర్ తో పాటు ఇతరులను పార్టీలో చేర్చుకొనే విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
also read:ఈ నెల 14 బీజేపీలోకి ఈటల.. రేపు రాజేందర్ ఇంటికి తరుణ్ చుగ్, భేటీకి ప్రాధాన్యం
టీఆర్ఎస్లోని అసంతృప్త నేతలతో పాటు ఇతర పార్టీల్లోని నేతలను తమ పార్టీలో చేర్చుకొనే విషయమై చర్చిస్తున్నారు. త్వరలోనే మరికొందరు కమలం పార్టీ తీర్ధం పుచ్చుకొనే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.
రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి బలపడాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీలో ఉత్సాహన్ని నింపాయి. అయితే నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. అయితే గతంలో కంటే మెరుగైన ఓట్లను సాధించింది. ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.