ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల త్వరలో అరెస్ట్ అవుతారని అన్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తరహాలోనే కవిత కూడా అరెస్ట్ అవుతారని చెప్పుకొచ్చారు. కాలం చెల్లిన నాయకులే బీఆర్ఎస్లో చేరుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ దోచుకున్న డబ్బులతో దేశమంతా తిరుగుతున్నారని ఆరోపించారు.
ఇక, లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు ఆదివారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన సీబీఐ ప్రధాన కార్యాలయంలో రాత్రి గడిపారు. అయితే సోమవారం ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. దాని కంటే ముందు సిసోడియాకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
దేశ రాజధానిలో కొత్త మద్యం విక్రయ విధానాన్ని తీసుకురావడంలో సిసోడియాతో పాటు మరి కొందరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2021 పాలసీని రూపొందించడంలో మద్యం కంపెనీలు పాలుపంచుకున్నాయని, దీని కోసం ‘సౌత్ గ్రూప్’ అని పిలిచే మద్యం లాబీ ద్వారా రూ.100 కోట్ల కిక్బ్యాక్లు చెల్లించారని సీబీఐ వాదిస్తోంది. ఇందుకు సంబంధించిన చార్జ్షీట్లలో కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును దర్యాప్తు సంస్థల అధికారులు ప్రస్తావించారు.
