సారాంశం

భాజపా నేత విజయశాంతి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారని, సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. దీనిపై విజయశాంతి స్పందిస్తూ పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఖండించారు

ఇటీవల బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. ఈ ప్రచారాన్ని విజయశాంతి తీవ్రంగా ఖండించారు. తాను బీజేపీని వదలనని, పార్టీలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. అసత్య ప్రచారంపై విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘‘రెండు రోజుల నుండీ రాములమ్మ బీజేపీ పార్టీతో దూరమవుతున్నారు. పార్టీతో అభిప్రాయభేదాలు ఉన్నవని ప్రచారం జరుగుతున్నది. అయితే.. ఇలాంటి ప్రచారం చేసేవాళ్లు ఇది సరైనదో..  కాదో ..తెలుసుకోవాలి. నేనైతే మహాశివుని కాశీ మహాపుణ్యక్షేత్రం, *"గరళకంఠుని"* సన్నిధానంలో ఆ ఆది దేవుని దర్శనార్థమై... హరహర మహాదేవ్’’ అని విజయశాంతి ట్వీట్ చేశారు.తనకు టీబీజేపీతో సమస్యలు ఉన్నట్లు టీఆర్‌ఎస్ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం అవాస్తవమని తేల్చి చెప్పారు.


గతేడాది అక్టోబరులోనూ విజయశాంతి పార్టీని వీడనున్నారనే ప్రచారం జరిగింది. అప్పుడూ కూడా  విజయశాంతి వివరణ ఇచ్చారు. ‘‘నాకు తెలంగాణ బీజేపీ నాయకత్వంతో సమస్యలు ఉన్నట్టు టీఆర్‌ఎస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం ఒక తీవ్రమైన కుట్ర. ఇది అవాస్తవం. ఒకవేళ అదే నిజమని ఎవరైనా భావిస్తున్నట్లయితే వారు ఒక నిజం తెలుసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర బీజేపీతో దూరం వెళ్లిపోవాల్సినంత భేదాభిప్రాయాలు నాకేమీ లేవు’’ అని విజయశాంతి క్లారిటీ ఇచ్చారు.