దళిత సాధికారత పథకం.. కేసీఆర్పై బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసలు
ఎస్సీల సాధికారత కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నామన్నారు బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు. ఎస్సీ సాధికారతపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్లో అఖిలపక్ష సమావేశం జరిగింది.
ఎస్సీల సాధికారత కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నామన్నారు బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు. ఎస్సీ సాధికారతపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఎస్సీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలతో కేసీఆర్ ఈ సందర్భంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న దళిత సాధికారత పథకం విధివిధానాలపై ఈ భేటీలో చర్చించారు.
Also Read:సీఎం దళిత సాధికారిత పథకం: దళితులకు శుభవార్త... రూ. 10 లక్షల ఆర్ధిక సాయం, కేసీఆర్ ప్రకటన
ఎస్సీల అభివృద్ధి కోసం అందరి సలహాలు తీసుకోవడం హర్షణీయమని మోత్కుపల్లి ప్రశంసించారు. కేసీఆర్ నిర్ణయాల వల్ల ఎస్సీల్లో నూతన ఉత్తేజం కలిగిందని నర్సింహులు సంతోషం వ్యక్తం చేశారు. అన్యాయానికి గురైన ఎస్సీ కుటుంబాలను ఆదుకోవాలని... దళారుల ప్రమేయం లేకుండా ఎస్సీలకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తే వారికి ఎంతో ప్రయోజనం జరుగుతుందని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు. రైతుబంధు తరహాలో నేరుగా సాయం అందాలని సూచించారు. గురుకులాలతో ఎస్సీ విద్యార్థుల ఆకాంక్షలు నెరవేరుతున్నాయని నర్సింహులు అన్నారు. కాగా, కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అఖిలపక్ష సమావేశాన్ని తెలంగాణ బీజేపీ బహిష్కరించినట్లు ప్రకటించినప్పటికీ ఆ పార్టీ నేత మోత్కుపల్లి హాజరవడం గమనార్హం.