కనపడ్డ నాయకుణ్ణి కనపడ్డట్టు సిద్దిపేటకు... ఎందుకోసమంటే..: ఈటల ఆగ్రహం
సీఎం కేసిఆర్ నాయకత్వంలో జరిగిన పరిణామాలు, ఏక పక్ష నిర్ణయాలు, అణచివేత పద్దతులన్నింటిని హుజురాబాద్ ప్రజలు గమనించారన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్.
కరీంనగర్: హుజూరాబాద్ ప్రజలకు తోడుగా నియోజక వర్గంలోని ఐదు మండలాలకు బిజెపి ఇంఛార్జిలను నియమించడం జరిగిందని ఆ పార్టీ నాయకులు ఈటల రాజేందర్ వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ రాజకీయ విజ్ఞత కలిగి మంచి ఏదో, చెడు ఏదో తెలుసుకోగల శక్తి ఉన్న వాళ్లే... సీఎం కేసిఆర్ నాయకత్వంలో జరిగిన పరిణామాలు, ఏక పక్ష నిర్ణయాలు, అణచివేత పద్దతులన్నింటిని గమనించారన్నారు. ఇలాంటి అణచివేత, దుర్మార్గాలకు చరమగీతం పాడాలని హుజూరాబాద్ నియోజక వర్గ ప్రజలు నిర్ణయించుకున్నారని ఈటల పేర్కొన్నారు.
''ఇవాళ ఐదుగురు మంత్రులు, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు.ఎమ్మెల్సీలు కనపడ్డ నాయకుణ్ణి కనపడ్డట్టుగా ప్రలోభ పెడుతున్నారు. నా వెంటున్న నాయకులను, సంఘాలను సిద్దిపేట పిలిపించుకొని దబాయింపులతో లొంగదిసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి దబాయింపులకు, ప్రలోభాలకు ఇక్కడున్న నాయకులు,సంఘాలు లొంగే ఆస్కారం లేదు'' అని ఈటల అన్నారు.
read more హుజూరాబాద్లో వచ్చే తీర్పే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతం: ఈటల
''ఎక్కడ ఎన్నికలు ఉన్నా పెండింగ్ పనులు పూర్తి చేసి బిల్లులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంగా సీఎం కేసిఆర్ కు డిమాండ్ చేస్తున్నా... రాష్ట్రంలో ఉన్న అన్ని పెండింగ్ బిల్లులు ఇవ్వగలరా? తమ నియోజక వర్గంలో మంత్రులు ఎమ్మెల్యేలు చేసే పనులు వాళ్ళ నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా మీ నియోజకవర్గ ప్రజలు వచ్చే ఎన్నికల్లో మీకు గుణ పాఠం చెబుతారు'' అని ఈటల హెచ్చరించారు.