తెలంగాణ సర్కారుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు బీజేపీ ఫిర్యాదు !
Bandi Sanjay: రాష్ట్రంలో మార్పు కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పోరాటం చేస్తున్నదని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
Telangana: రాష్ట్రంలోని ప్రజలు ముఖ్యమంత్రిని విస్మరిస్తున్నందున తమ పార్టీ కూడా ముఖ్యమంత్రిని విస్మరిస్తుందని తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో మార్పు కోసం తమ పార్టీ పోరాడుతుందని, ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. తమ పార్టీని నియంత్రించేందుకు సీఎంఓలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా విమర్శలు గుప్పించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ, అలాగే, ప్రజలు సైతం కేసీఆర్ ను పట్టించుకోవడం లేదని బండి సంజయ్ అన్నారు. సికింద్రబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభ పనులను పరిశీలించిన అనంతరం బండి సంజయ్ పై వ్యాఖ్యలు చేశారు.
పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ
జులై 3న సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న పార్టీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో తమ విధానాలను ప్రజలకు తెలియజేసేందుకు, వారికి అవగాహన కల్పించేందుకు ఈ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బహిరంగ సభకు 10 లక్షల మందిని సమీకరించడమే తమ లక్ష్యమని, సభకు ప్రజలను సమీకరించేందుకు బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ సమావేశాలు నిర్వహించామని తెలిపారు. బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలిరావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
NHRCకి ఫిర్యాదు..
కొత్త రేషన్ కార్డుల జారీలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై బండి సంజయ్ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్చార్సీ)కి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన 19 లక్షల రేషన్కార్డులు, కొత్త రేషన్కార్డుల జారీకి రూపొందించిన నిబంధనలపై కమిషన్ విచారణ జరిపించాలని కోరారు. రేషన్కార్డుల జారీపై విధించిన నిషేధాన్ని ఉపసంహరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రేషన్కార్డులు జారీ చేసేలా కమిషన్ చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం
జూలై 2న హెచ్ఐసీసీ నోవాటెల్లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఆ తర్వాతి రోజు పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ మాజీ అధ్యక్షులు, ఇతర పార్టీ నేతలు, ముఖ్యమంత్రులతో సహా దాదాపు 340 మంది బీజేపీ అగ్రనేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ తెలిపారు. ఇది ఒక చారిత్రాత్మక సంఘటన అవుతుంది. ఒక్క తెలంగాణకే కాదు, దక్షిణాది మొత్తం రాజకీయాలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. ప్రధాని అయిన తర్వాత మోడీ నగరంలో రెండు రోజులు గడపడం ఇదే తొలిసారి. దేశంలోని 'ప్రధాన్ సేవక్' అయిన మోడీ అనేక పార్టీ 'కార్యకర్త'లలో ఒకరిగా జాతీయ కార్యవర్గంలోని అన్ని సెషన్లకు హాజరవుతారని చుగ్ చెప్పారు.