గవర్నర్ ను 18 సార్లు కలసిన బిజెపి, అయినా లాభం లేదు
పాపం, తెలంగాణ బిజెపి
రాష్ట్ర ప్రభుత్వం పార్టీ మాటను ఖాతరుచేయదు
ఢిల్లీ నేతలు కెసిఆర్ తో దోస్తీ వదలరు
తెలంగాణ లో బిజెపి మాట ఏమాత్రం చెల్లుబాటు కావడం లేదు. ఆ పార్టీకి వాళ్ల జాతీయ పార్టీ గాని,బిజెపి నాయకత్వంలోఉన్న ఏన్డీయే ప్రభుత్వం గాని ఈవిషయంలో పెద్ద మద్దతు చెప్పడం లేదు. అందుకే ఆపార్టీ కి చెందిన ఒక ముఖ్యమయిన డిమాండ్ ఒక నినాదంగానే ఉండిపోతా ఉంది. ఆ డిమాండ్ ఏమిటో తెలుసా.... సెప్టెంబర్ 17, తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర ప్రభుత్వ పండగా జరపాలన్నది. నిజానికి బిజెపి స్పూర్తి దాత సర్దార్ వల్లభ బాయ్ పటేల్ సాహసానికి చెందిన వ్యవహారమయిన కేంద్రం దీనిమీద ఏమీ చేయలేకపోతున్నది. అాాందుకే అది బిజెపి పార్టీ కార్యక్రమంలాగా జరిగిపోతున్నది. ఈ తంతు కొనసాగింపుగా ఈ నెల 17న నిజామాబాద్లో తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు.
గురువారం లక్ష్మణ్ నేతృత్వంలో పలువురు బీజేపీ నేతలు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలిశారు. కలిసొచ్చాక ఆయన ఒక ఆసక్తి కరమయిన విషయం వెల్లడించారు.
సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ను ఎప్పటిలాగే కోరామని చెబుతూ ఇప్పటివరకు ఈ అంశంపై 18 సార్లు గవర్నర్ను కలిశామని చప్పారు. గవర్నర్ కు ఇచ్చిన వినతి పత్రాల వల్ల ప్రయోజనమేమీ చేకూరలేదని ఆయన నిట్టూర్చారు.
అయితే, పార్టీ విమోచన దినోత్సవాన్ని జరుపుతూనే పోతుందని అంటూ 17న నిజామాబాద్లో విమోచనా దినోత్సవాన్ని ఘనంగా జరుపుతామని చెప్పారు.
ఈ సందర్బంగా బహిరంగ సభ జరగనుందన్నారు. ఈ బహిరంగసభలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ పాల్గొంటారని లక్ష్మణ్ తెలిపారు.