Huzurabad Bypoll: టీఆర్ఎస్ కు షాకిచ్చేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు, నిరుద్యోగులు రెడీ... భారీ నామినేషన్లు
టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా హుజురాాబాద్ ఉపఎన్నికలో పోటీ చేస్తామని ప్రకటించిన ఫీల్డ్ అసిస్టెంట్లు, నిరుద్యోగులు నామినేషన్లకు సిద్దమయ్యారు.
కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ ఉపఎన్నిక జరుగుతోంది. ఈ ఉపఎన్నికను టీఆర్ఎస్, బిజెపి లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయగా బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ కు సిద్దమయ్యారు. వీరితోపాటే వెయ్యిమంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 200మంది నిరుద్యోగులు టీఆర్ఎస్ సర్కార్ కు వ్యతిరేకంగా హుజురాబాద్ బరిలో దిగడానికి సిద్దమయ్యాయి. దీంతో ఈ ఉపఎన్నిక మరింత రసవత్తరంగా మారింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హమీ పథకం కింద పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించింది. తమను ఇలా రోడ్డున పడేయడం బావ్యం కాదని.. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కొంతకాలంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనకు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మద్దతు ప్రకటించారు.
అయితే తమ ఆందోళనకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడంతో హుజురాబాద్ ఎన్నికల ద్వారా తమ సత్తాఏంటో చాటాలని ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్ణయించుకున్నారు. నిజామాబాద్ లోక్ సభ ఎన్నిక సమయంలో పసుపు రైతులు అనుసరించి వ్యూహాన్నే తాముకూడా అనుసరించి టీఆర్ఎస్ గెలుపు అవకాశాలను దెబ్బతీయాలని ఫీల్డ్ అసిస్టెంట్లు భావిస్తున్నారు. అందుకోసం దాదాపు 1000మంది అసిస్టెంట్లు హుజురాబాద్ బరిలోకి దిగడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.
read more 13, 14వ తేదీల్లో వాళ్లు నాపై దాడి చేస్తారేమో.. వాటికి కేసీఆరే బాధ్యత వహించాలి: ఈటల
ఇప్పటికైనా తమను విధుల్లోకి తీసుకొంటామని టీఆర్ఎస్ హామీ ఇస్తే హుజురాబాద్ లో పోటీ నుండి తప్పుకొంటామని ఫీల్డ్ అసిసెంట్లు ప్రకటించారు. ఈ ఉప ఎన్నికల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల తరపున తాను ప్రచారం చేస్తానని ఆర్. కృష్ణయ్య హామీ ఇచ్చారు. పీల్డ్ అసిస్టెంట్లు ఎన్నికల బరిలో నిలిస్తే బ్యాలెట్ పేపర్ చాలా పెద్దదిగా మారిపోయే అవకాశం ఉంది.
మరోవైపు వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్సార్టీపీ ఆధ్వర్యంలో 200 మంది నిరుద్యోగులు కూడా హుజురాబాద్ బరిలో నిలుచుంటామంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో భారీగా ఖాళీలున్నా ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడంతో నిరుద్యోగ యువత కేసీఆర్ సర్కార్ పై గుర్రుగా వుంది. ఈ క్రమంలోనే నిరుద్యోగ సమస్యపై షర్మిల నిరసనబాట పట్టారు. దీంతో వైఎస్సార్ టిపి తరపున భారీ సంఖ్యలో బరిలోకి దిగి టీఆర్ఎస్ గెలుపు అవకాశాలను దెబ్బతీయాలని నిరుద్యోగులు భావిస్తున్నారు.