బోయిన్పల్లి కిడ్నాప్ కేసు: అఖిలప్రియ బెయిల్ పిటిషన్ వాయిదా
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో నిందితురాలిగా వున్న మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం వచ్చే వారానికి వాయిదా వేసింది
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో నిందితురాలిగా వున్న మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం వచ్చే వారానికి వాయిదా వేసింది. సోమవారం బెయిల్ పిటిషన్పై ఆదేశాలివ్వనుంది సికింద్రాబాద్ కోర్ట్.
కిడ్నాప్ కేసులో అరెస్టైన తెలుగుదేశం నేత, మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో పోలీసులు కస్టడీ ముగిసింది. కస్టడీ ముగియడంతో.. గురువారం మధ్యాహ్నం ఆమెకు బేగంపేట పాటిగడ్డలోని బస్తీ దవాఖానాలో కరోనా పరీక్షలు చేయించినట్లు తెలిసింది.
ఆమెకు నెగటివ్ అని తేలడంతో.. గాంధీ ఆస్పత్రికి తరలించారు. గర్భవతిగా ఉన్న అఖిలకు అక్కడ పలు పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత మారేడ్పల్లిలోని న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపరిచి తిరిగి చంచల్గూడ జైలుకు తరలించారు.
Also Read:మా భూములే ఆక్రమించాడు.. అన్నా... మీరే న్యాయం చెప్పండి !.. అఖిల ప్రియ
కాగా, పోలీసు విచారణ పూర్తికావడం, గర్భవతిగా ఉండటాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుని, ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ కేసులో మరొక పేరు తెరపైకి వచ్చింది. విజయవాడకు చెందిన సిద్ధార్ధ్ అనే వ్యక్తి తన మనుషులతో నవీన్ రావు తదితరులను కిడ్నాప్ చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.
సిద్ధార్థ్ నందిగామ ప్రాంతంలో సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతున్నట్టు సమాచారం. బౌన్సర్లుగా వ్యవహరించిన వాళ్లంతా సిద్ధార్థ్ నడుపుతున్న ఏజెన్సీలో పనిచేసే వాళ్లే. వీళ్లందరినీ ఈ నెల 4న నగరానికి తీసుకొచ్చినట్టు తెలిసింది.
ఐటీ అధికారుల వెంట బౌన్సర్లుగా ఉండాలని, తగిన పారితోషికం ఇస్తామని సిద్ధార్థ్ వారికి చెప్పినట్టు సమాచారం. కిడ్నాప్ సీన్ రివర్స్ కావడంతో వారంతా కేసులో నిందితులుగా ఇరుక్కుపోయారు