విచారణకు హాజరు కాలేను: ఢీల్లీ లిక్కర్ స్కాంలో ఈడీకి కవిత లేఖ
విచారణకు రావాలని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు హాజరుకాలేనని ఈడీకి కవిత సమాధానం పంపారు.
![Bhrarat Rashtra Samithi leader Kalvakuntla Kavitha Writes letter to Enforcement Directorate lns Bhrarat Rashtra Samithi leader Kalvakuntla Kavitha Writes letter to Enforcement Directorate lns](https://static-ai.asianetnews.com/images/01h77y31jerna8vdzm98r0kj1z/fotojet---2023-08-07t173312-479-jpg_363x203xt.jpg)
హైదరాబాద్: ఈ నెల 15న విచారణకు హాజరు కాలేనని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం నాడు లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ నెల 15న విచారణకు హాజరు కావాలని కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు పంపింది. అయితే విచారణకు హాజరు కాలేనని కల్వకుంట్ల కవిత ఈడీకి లేఖ రాశారు.
also read:విచారణకు రావాలి: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు మరోసారి ఈడీ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేశారు.2023 సెప్టెంబర్ 4వ తేదీన కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. తదుపరి విచారణకు నోటీసులు ఇవ్వొద్దని అప్పట్లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఇంకా కొనసాగుతున్న విషయాన్ని కవిత ఈడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. విచారణకు రాలేనని ఆ లేఖలో స్పష్టం చేశారు.ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కూడ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నాలుగు దఫాలు ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.ఈ నోటీసులు రాజకీయ ప్రేరేపితమైనవిగా అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఇప్పటికే దర్యాప్తు సంస్థలు పలువురిని అరెస్ట్ చేశాయి.ఈ కేసులో కొందరు అఫ్రైవర్లుగా కూడ మారారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ లను కూడ దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై బురద చల్లేందుకే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశాయని ఆప్ ఆరోపణలు చేస్తుంది.
రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కూడ ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన విషయం తెలిసిందే. ఈ కేసు విషయమై సీబీఐ, ఈడీ అధికారులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కవితకు గతంలో చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేసిన వ్యక్తిని కూడ దర్యాప్తు అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో కవితపై బీజేపీ పలు ఆరోపణలు చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై కూడ బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.