యాదాద్రికి ఆలయానికి కేజీ 16 తులాల బంగారం కానుకగా సమర్పించిన సీఎం కేసీఆర్
Yadadri Temple: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఆలయ అభివృద్ధి సంస్థ (వైటీడీఏ), శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయ పట్టణంలో పెండింగ్లో ఉన్న పనులపై అధికారులను అడిగి తెలుసుకుని వాటిని వేగవంతం చేయాలని ఆదేశించారు.
Yadadri-CM KCR: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి విమాన గోపురానికి బంగారు తాపడం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) శుక్రవారం ఒక కిలో పదహారు తులాల బంగారాన్ని విరాళంగా అందజేశారు. ఉదయం 11:45 గంటలకు ముఖ్యమంత్రి వాహనంలో యాదాద్రికి చేరుకున్నారు. ఆయన వాహనశ్రేణిలో గిరి ప్రదక్షిణ అనంతరం రాష్ట్రపతి సూట్లో కొద్దిసేపు గడిపారు.
వివరాల్లోకెళ్తే... ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలోనే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి విమాన గోపురానికి బంగారు తాపడం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) శుక్రవారం ఒక కిలో పదహారు తులాల బంగారాన్ని విరాళంగా అందజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ గీతకు దీనికి సంబంధించిన చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ, మనవడు హిమాన్షుతో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు యాదాద్రి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
కళా వేదిక స్థల పరిశీలనలో..
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్.. కళా వేదిక ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. ప్రధాన ఆలయాన్ని తిరిగి తెరిచిన తర్వాత బాలాలయం తొలగించిన స్థలంలో కళా వేదిక నిర్మించాలని అనుకున్నారు. అలాగే, హైదరాబాద్ నుంచి యాదాద్రికి వచ్చి కొండ గుడి చుట్టూ వేసిన గిరి ప్రదక్షిణ రహదారిని కూడా పరిశీలించారు.
ఆలయ అధికారులతో సమీక్షా
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఆలయ అభివృద్ధి సంస్థ (వైటీడీఏ), శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయ పట్టణంలో పెండింగ్లో ఉన్న పనులపై అధికారులను అడిగి తెలుసుకుని వాటిని వేగవంతం చేయాలని ఆదేశించారు. యాదాద్రిలో భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రికి నాలుగు గంటల పర్యటన ముగించుకుని రోడ్డు మార్గంలో హైదరాబాద్ బయలుదేరారు.
ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా యాదాద్రి కొండపై, యాదగిరిగుట్టలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు . ఆయన కాన్వాయ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కొందరిని అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు విస్తరణ కొంత మందిపై ప్రభావం చూపుతున్న విషయాన్ని హైలైట్ చేయాలని వారు కోరినట్లు తెలిసింది. యాదాద్రి పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రులు ఏ ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్, జీ జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డీ దామోదర్ రావు, బడుగుల లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.